అత్యంత సాంకేతికతతో కూడిన పంబన్ వంతెన ప్రారంభం
అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర వంతెన ఇది.
రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా తమిళనాడులో రూ.8300కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో భారీ ప్రాజెక్టుల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఉత్తరాన చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనల్లో ఒకటైన ‘చీనాబ్ వంతెన’ జమ్మూ కశ్మీర్లో నిర్మించామని చెప్పారు. పశ్చిమంలో ముంబయిలో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ నిర్మించినట్లు పేర్కొన్నారు.
తూర్పు వైపున అసోంలోని ‘బోగీబీల్ వంతెన’ కనిపిస్తుందని, దక్షిణాదికి వస్తే ప్రపంచంలోని కొన్ని నిలువు లిఫ్ట్ బ్రిడ్జిలలో ఒకటైన ‘పంబన్ వంతెన’ నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో తమిళనాడుది పెద్ద పాత్ర అని చెబుతూ తమిళనాడు బలం ఎంతగా పెరుగుతుందో భారత్ అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానని తెలిపారు.
గత దశాబ్ద కాలంలో 2014 కంటే మూడు రెట్లు అధికంగా తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కారణం లేకుండా ఏడవడం కొందరికి అలవాటని పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విసుర్లు విసిరారు. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ సంవత్సరం తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6 వేల కోట్లకుపైగా కేటాయించారని గుర్తు చేశారు.