ఆత్మ నిర్భర భారత్ కి నిలువెత్తు రూపం ‘‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’’
పూర్తి దేశీయ టెక్నాలజీతో నిర్మించిన యుద్ధనౌక ‘‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’’. భారత నౌకాదళానికి ఇదో మైలురాయి. ఇది ఇప్పుడు విశాఖ నేవల్ డాక్ యార్డు వద్ద ప్రారంభమైంది. తన సేవలను అందించడానికి నౌకాదళంలోకి వచ్చేసింది. తూర్పు నావికాదళ ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ దీనిని ప్రారంభించారు.
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యమున్న ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’ యుద్ధనౌక సోమవారం విశాఖపట్నంలో లాంఛనంగా జలప్రవేశం చేసింది. యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) విభాగంలో ఇది రెండో నౌక కావడం విశేషం. ఈ నౌక చేరికతో భారత సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతు తక్కువగా ఉండే జలాల్లో భద్రత మరింత పటిష్ఠం కానుంది.
విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశీయంగా నిర్మించిన ఇలాంటి యుద్ధనౌకలు భారత సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ సత్తా
కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించిన ఈ యుద్ధనౌక, ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి నిలువుటద్దంలా నిలుస్తోంది. దీని నిర్మాణంలో 80 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు. 77 మీటర్ల పొడవున్న ఈ నౌక, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో శత్రు జలాంతర్గాములను కచ్చితత్వంతో గుర్తించి, ఛేదించగలదు.
ప్రత్యేకతలు
‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’ కేవలం జలాంతర్గాముల వేటకే పరిమితం కాదు. సముద్ర గస్తీ, తీరప్రాంత రక్షణ, అన్వేషణ, సహాయక చర్యలు వంటి బహుళ విధులను సమర్థవంతంగా నిర్వహించగలదు. మూడు వాటర్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉండటంతో ఇది అత్యంత వేగంగా, చురుగ్గా కదలగలదు. లక్షద్వీప్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ‘ఆండ్రోత్’ ద్వీపం పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధనౌక రాకతో భారత నౌకాదళం బలం మరింత పెరిగింది.
యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో ఐఎన్ఎస్ అర్నాలా తర్వాత ఇది రెండో యుద్ధనౌక కావడం గమనార్హం. మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా.. ఈ ఏడాది జూన్ 18వ తేదీన ఇండియన్ నేవీలో చేరింది. లక్షద్వీప్లోని అండ్రోత్ అనే దీవి పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. ఈ ఐఎన్ఎస్ అండ్రోత్లో దేశీయంగా రూపొందించిన 30 మిల్లీమీటర్ల సర్ఫేస్ గన్ ఉంది. ఈ నౌకలు విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రువులకు సంబంధించిన జలాంతర్గాములను వేటాడనున్నాయి.