ఆఫ్రికా నుంచి భారత్కు మరో 8 చీతాలు రాక
ఆఫ్రికాలోని బోట్స్ వానా నుంచి భారత్ కి మరో 8 చీతాలు వస్తున్నాయి. రెండు విడతల్లో వీటిని అధికారులు భారత్ కి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సమావేశమైంది. ఈ సమావేశంలోనే పై నిర్ణయం జరిగింది. మే మాసంలో నాలుగు చీతాలు, ఆ తర్వాత మాసంలో మరో నాలుగు చీతాలను తీసుకొస్తామని అధికారులు తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో వున్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి ఈ చిరుతలను తరలిస్తారు.
కాగా, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్రం 2022, సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్లో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 భారత్లో జన్మించిన కూన పిల్లలు. దేశంలో 71 ఏండ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తున్నది.