ఇస్రో చైర్మన్ సోమనాథ్ కి ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఇస్రో సాధించిన విజయానికి గుర్తుగా అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ కార్యక్రమం ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగింది. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ కీలక భాగస్వామ్యాన్ని చెబుతోందని ఇస్రో సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రయాన్-3 ద్వారా ఇస్రో సాధించిన విజయంపై ఐఏఎఫ్ ప్రశంసలు కురిపించింది. ఈ మిషన్ శాస్త్రీయ ఉత్సుకత, వ్యయ-సమర్థవంతమైన ఇంజనీరింగ్ సమ్మేళనానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది.
ఈ సందర్భంగా ఇస్రో తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘చంద్రయాన్ -3 అసాధారణ విజయానికి గాను ప్రతిష్ఠాత్మక ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. అంతరిక్ష పరిశోధనలకు భారతదేశం చేసిన కృషికి ఈ గుర్తింపు గుర్తుగా నిలుస్తుంది. కొత్త సరిహద్దుల కోసం కృషి చేస్తూనే ఉంటాం’ అనే పేర్కొంది.
కాగా, చంద్రుని కూర్పు, ఖగోళంలోని రహస్యాలను వేగంగా వెలికితీయడంతో చంద్రయాన్ 3 ప్రయోగం కీలక ముందడుగు అని ఐఏఎఫ్ పేర్కొంది. ‘చంద్రయాన్ 3 మిషన్ ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణకు సాక్ష్యం. చారిత్రాత్మక మైలురాయిని సాధించడం ద్వారా, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవం దగ్గర దిగిన మొదటి దేశంగా నిలిచింది. అంతర్జాతీయంగా ఆశయం, సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది’ అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.