ఇస్లాం వున్నంత వరకూ ఉగ్రవాదం వుంటుంది : తస్లీమా నస్రీన్
ఇస్లాం, ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం వుంటుందంటూ పేర్కొన్నారు. ఢిల్లీ లిటరేచర్ ఫెస్టివల్ లో తస్లీమా నస్రీన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని, 2016 లో బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన దాడికి మధ్య సారూప్యతలను ఆమె విశ్లేషించారు.
గత 1,400 సంవత్సరాలుగా ఇస్లాం తీరు మారలేదని, ఇది అలాగే ఉన్నత కాలం ఉగ్రవాదులు పుట్టుకొస్తూనే వుంటారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఢాకా ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ.. అక్కడి ప్రజలు కల్మా పారాయణం చేయకపోవడం వల్లే ఉగ్రవాదులు వార్ని చంపేశారని తెలిపారు.అచ్చు పహల్గామ్ దాడి సమయంలో కల్మా పారాయణం చేయమని ఉగ్రవాదులు ప్రజలను అడిగారని, అలా చేయలేని వారిని కాల్చి చంపారని స్థానికులు చెప్పారని రచయిత్రి పేర్కొన్నారు.
యూరప్ లోని చర్చిలు ఇప్పుడు మ్యూజియంలుగా మారుతున్నాయని, కానీ.. ముస్లిం సమాజం ఇప్పటికీ కొత్త మసీదులను నిర్మించడంలోనే నిమగ్నమైందని దెప్పిపొడిచారు. మదర్సాలు వుండొద్దని, అలాగే పిల్లలు కేవలం మత గ్రంథాలను మాత్రమే చదవకుండా, సాధారణ విద్యలను కూడా అభ్యసించే అవకాశం ముస్లిం పిల్లలకు వుండాలని సూచించారు.