ఉగ్రవాద చర్యలను ఇక నుంచి యుద్ధంగానే పరిగణిస్తాం : భారత్ స్ట్రాంగ్ మెసేజ్
కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారంతో తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఇరు దేశాలూ ప్రకటించాయి. అయితే ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా.. అది ‘‘యుద్ధ చర్య’’ గానే పరిగణిస్తామని తేల్చి చెప్పింది. దానికి తగ్గట్లుగానే తమ స్పందన మాత్రం వుంటుందని, దీనిని మరిచిపోవద్దని హెచ్చరించింది.
ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినా… ఉగ్రవాదంపై పోరు మాత్రం అలాగే కొనసాగుతుందని భారత్ తేల్చి చెప్పింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని, అంతే తీవ్ర స్థాయిలో బదులివ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిసింది.