ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకారం

కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారంతో తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఇరు దేశాలూ ప్రకటించాయి. తాము కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.
ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ మధ్యాహ్నం 3:35 గంటలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయన్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓ కి ఫోన్ చేశారని, కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమలులోకి వచ్చిందని, భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందన్నారు. ఈ నెల 12 న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారని మిస్రీ తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు పాక్ ప్రకటించింది. తక్షణం కాల్పులను విరమించేందుకు భారత్ కూడా అంగీకరించిందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. ‘‘పాక్, భారత్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, భద్రతకు పాక్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది. తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా శాంతిస్థాపనకు ప్రయత్నిస్తుంది’’ అని ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *