ఐదుగురు టాప్ ఉగ్రవాదుల హతం.. పూర్తి వివరాలివీ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై జరిపిన మెరుపు దాడులు ఆపరేషన్ సిందూర్ లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీరిలో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ టాప్ ఉగ్రవాదులు ఉన్నట్లు వారి వివరాలను శనివారం ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన ఉగ్రవాదుల్లో జమ్ముకశ్మీర్​లో తీవ్రవాద బోధన చేయడం, ఆయుధ శిక్ష, ఉగ్రదాడుల సమన్వయంలో పాల్గొన్న కీలక వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో కొందరి అంత్యక్రియలకు పాక్ సైన్యం, పోలీసులు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా హాజరైనట్లు సమాచారం.
1. మదస్సర్ ఖాదియాన్ ఖాన్
లష్కరే తయిబా ఉగ్రవాదులు మదస్సర్ ఖాదియాన్ ఖాన్​, ఖలీద్ అలియాస్ అబు అకాషాను భారత్​ మట్టుబెట్టింది. మదస్సర్ మురిద్కేలోని మర్కజ్​ తైబా బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఇతడి అంత్యక్రియలకు పాక్ సైన్యం గార్డ్​ ఆఫ్​ హానర్ ఇచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తరఫున పుష్ఫగుచ్ఛాలు ఉంచారు.
అంతేకాకుండా మదస్సర్​ అంత్యక్రియల ప్రేయర్ జమాత్ ఉల్ దవాకు చెందిన గ్లోబర్ టెర్రరిస్ట్​ హఫీజ్​ అబ్దుల్ నిర్వహిస్తున్న ప్రభుత్వం పాఠశాలలో జరిగింది. ఈ ప్రార్థనకు పాక్​ ఆర్మీలో లెఫ్టివెంట్ జనరల్, పాక్​ పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్​ కూడా హాజరయ్యారు.
2. ఖలీద్ అలియాస్
మరోవైపు, ఖలీద్- జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు, అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో జరిగిన అతని అంత్యక్రియలకు పాక్ ఆర్మీ సీనియర్, అధికారులు. ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.
3. మహమ్మద్‌ యూసఫ్‌ అజార్‌ (జైషే మహమ్మద్‌ )
జైషే మహమ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌ పెద్ద బావమరిది హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌, అజార్‌ మరో బావమరిది మహమ్మద్‌ యూసఫ్‌ అజార్‌ భారత్ దాడుల్లో హతమయ్యారు. ఇసి-814 కాందహార్ హైజాక్ కేసులో మహ్మద్ యూసుఫ్ అజార్‌ను వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడు జైషే మహ్మద్​ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇచ్చేవాడు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్​లో అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డాడు.
4. హఫీజ్ మహమ్మద్‌ (జైషే మహమ్మద్‌ )
ఇక, మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, పాకిస్థాన్‌లోని బహవల్‌పుర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ఇంఛార్జ్. అతను యువతను తీవ్రంగా ప్రేరేపించడంలో, జెఇఎం కోసం నిధుల సేకరణలో చురుకుగా పాల్గొన్నాడు.
5. మొహమ్మద్ హసన్ ఖాన్ (జైషే మహ్మద్)
వీరితో పాటు ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు మొహమ్మద్ హసన్ ఖాన్- జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించిన జేఈఎం (పీఓకే) ఆపరేషనల్ కమాండర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *