కలలో కూడా ఊహించని శిక్షలుంటాయి : హెచ్చరించిన ప్రధాని మోదీ
పహల్గామ్ ఉగ్రవాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి బహిరంగంగా స్పందించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షిస్తామని ప్రకటించారు. అలాగే ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కూడా ఇదే విధమైన ట్రీట్మెంట్ వుంటుందన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్ లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పహల్గాం మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా వుందన్నారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని, ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడ్ని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకూ శత్రువులు చేసిన సాహసమని అన్నారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తామని, ఈ మేరకు భారతీయులకు హామీ ఇస్తున్నానని కీలక ప్రకటన చేశారు.