కలుపు మొక్కల తొలగింపు కోసం ప్రత్యేక యంత్రం తయారు చేసిన విద్యార్థి
రైతులకు వున్న కష్టాల్లో ఆర్థిక కష్టం అతి ముఖ్యమైంది. దీంతో పాటు కలుపు మొక్కలు కూడా అంతే స్థాయిలో కష్టపెడుతుంటాయి. దీనికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ రైతులు దీనిని అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. దీనికి ఓ విద్యార్థి వినూత్న పరికరాన్ని ఆవిష్కరించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ కు చెందిన ముత్యం యశ్వంత్ అనే విద్యార్థి పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. గతంలో ఈ విద్యార్థి ఈజీ బల్బు రిమూవర్, మంకీ గన్ లాంటి ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. అయితే అందులో ఈజీ బల్బు రిమూవర్ పరికరం జాతీయ స్థాయిలో పలు విభాగాల్లో ఎంపికైంది. యశ్వంత్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్లా జిల్లా తిప్పాపూర్ గ్రామం.
రైతులు పంట పొలాల్లో ఎదుర్కునే ప్రధాన సమస్య కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు పొలాల్లో పెరుగుతున్నాయని, రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని.. కలుపు తీసేందుకు అధిక మొత్తంలో కూలీలను ఉపయోగిస్తుంటారు. అయితే రైతుల కష్టాలను, కూలీల ఖర్చును తగ్గించాలని ఉద్దేశంతో తానీ ప్రయత్నం చేసినట్లు యశ్వంత్ తెలిపాడు. తనకు ఈ యంత్రం తయారు చేయడానికి బయాలజీ టీచర్ కృష్ణ ఎంతో గైడ్ చేశారని తెలిపారు. ఈ యంత్రాన్ని తయారు చేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు సమయం పట్టిందని, 800 రూపాయల నుంచి 1000 ఖర్చు అయ్యిందని తెలిపాడు.