కాశీ విశ్వనాథ్ ఆలయం – జ్ఞానవాపి మసీదు సర్వేకు కోర్టు అనుమతి
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు సంబంధించిన ఖర్చును భరించాలని కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు ఉన్న భూమిని హిందువులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ మేరకు విశ్వనాథ ఆలయం – జ్ఞానవాపి మసీదు స్థలాన్ని సర్వే చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంజేబు కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకొని ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేసి అక్కడే జ్ఞానవాపి మసీదును నిర్మించినట్టు కొన్ని కథనాలు ఉన్నాయి.
అయితే అసలు కూల్చిన చోటనే విశ్వనాథ ఆలయం ఉండేదని హిందువులు అన్నారు. ఈ మేరకు అక్కడి హిందువులు వివాదాస్పద స్థల యాజమాన్యానికి సంబంధించి వివరణ కోరుతూ 1991లో వారణాసి జిల్లా కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రస్తుతం వివాదాస్పద స్థలంలో సర్వేకు కోర్టు అనుమతి ఇవ్వడంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.