కెనడాలోని గురుద్వారా, హిందూ దేవాలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు
కెనడాలోని ఖలిస్తానీ వాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా వాంకోవర్ లోని గురుద్వారాపై, కొలంబియాలోని హిందూ దేవాలయాల గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ సంఘటనను హిందూ, సిక్కు సమాజం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. వాంకోవర్ లోని ఖల్సా దివాన్ సొసైటీ గురుద్వారా, రాస్ స్ట్రీట్ గురుద్వారా గోడలపై ఖలిస్తానీ నినాదాలు దర్శనమిచ్చాయి. దీనిని గురుద్వారా వర్గాలు ఖండించాయి. పవిత్రమైన గురుద్వారా గోడలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఖల్సా సజ్నా దివస్ సందర్భంగా ఐక్యతా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలా చేయడం తీవ్రంగా ఖండించదగ్గదని పేర్కొన్నారు.
రాడికల్ శక్తులు సిక్కు వర్గాన్ని విభజించాలని చూస్తున్నాయని గురుద్వారా ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే భయాన్ని సృష్టించాలన్న ప్రయత్నంలో కొందరు వున్నారన్నారు. ఇలాంటి ప్రయత్నాలు సఫలీకృతం కావని తేల్చి చెప్పారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇదే గురుద్వారాలో నాగర్ కీర్తన, బైసాఖీ జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రవేశాన్ని కల్పించలేదు. దానికి ప్రతీకారంగానే ఇలాంటి చర్యలకు దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక.. సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద కూడా ఖలిస్తానీ అనుకూలురు వీరంగం చేశారు. ఉదయం సమయంలో ఇద్దరు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆలయంలోకి ప్రవేశించి, స్తంభాలు, ద్వారాలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాసినట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆధారాలు దొరక కూడదని సీసీటీవీలను కూడా దొంగలించారన్నారు. హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతను సాధించడంలో ఈ దేవాలయం కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే లక్ష్యంగా చేసుకున్నారేమోనని ఆలయ ప్రతినిధి పురుషోత్తం గోయల్ అన్నారు. ఇదంతా ప్రణాళికా బద్ధంగా జరుగుతోందని, కుట్రలు పన్నుతున్నారన్నారు. మరోవైపు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.