చైనా ముడిసరుకు వుందా? వద్దన్న భారత్

రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా బీజింగ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న పార్ట్‌లను వాడుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన 3 కాంట్రాక్టులను రద్దు చేసుకొంది. సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం 400 డ్రోన్లను తయారుచేయాల్సి ఉంది.

ఇప్పటికే ప్రభుత్వం డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ వాడకుండా పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. తాజాగా రద్దు చేసిన కాంట్రాక్టులో 200 మీడియం ఆల్టిట్యూడ్‌ డ్రోన్లు, 100 హెవీ వెయిట్‌ లాజిస్టిక్స్‌ డ్రోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.230 కోట్లు. 2023లో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది.

ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనాతో 3,488 కిలోమీటర్ల మేరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించనున్నారు. ‘‘దురదృష్టవశాత్తూ కొన్ని భారతీయ కంపెనీలు కొన్ని విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకొని సైన్యం కోసం తయారుచేసే డ్రోన్లలో వాడుతున్నాయి. ఇది ప్రధానంగా సైబర్‌ సెక్యూరిటీకి, డేటా రక్షణకు ముప్పుగా మారడంతోపాటు.. దళాల కార్యకలాపాల్లో గోప్యత కూడా లేకుండా పోతుంది. శత్రువులు జూమింగ్‌ సాయంతో మన డ్రోన్లను సీజ్‌.. లేదా సాఫ్ట్‌ కిల్‌ చేయగలుగుతారు. అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్‌లో బ్యాక్‌డోర్‌ కూడా ఉండే అవకాశం ఉంది. అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్లను బైపాస్‌ చేయగలవు’’ అని రక్షణశాఖకు చెందిన కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.

చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నిఘా, పహారా తదితర మిషన్ల సమయంలో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో.. అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. గతేడాది ఆగస్టులో రాజౌరీ సెక్టార్‌లో మోహరించిన ఇన్‌ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించగా అవి దారి మళ్లి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూలాయి. ఆ ఘటనపై దర్యాప్తు చేయగా.. దానిలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రక్షణశాఖ, సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్‌పై దృష్టిసారించింది. దీనికితోడు ఫిక్కీ, సీఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *