జాతీయవాది సూర్యకాంత్ బాలి మరణంపై సంతాపం ప్రకటించిన ఆరెస్సెస్
ప్రఖర జాతీయవాది, తత్వవేత్త, ప్రఖ్యాత రచయిత డాక్టర్ సూర్యకాంత్ బాలి మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ట్వీట్ చేశారు.
‘‘ప్రముఖరచయిత, సాహితీవేత్త డా. సూర్యకాంత్ బాలి గారి మరణ వార్త విచారకరం. తన జాతీయవాద ఆలోచనలతో హిందీ సాహిత్యాన్ని పోషించారు. ఆయన రచనలు, సాహిత్యం, జర్నలిజం రంగాలకు కొత్త వెలుగులు తెచ్చాయి. హిందీ, సంస్కృత భాషల్లో గొప్ప నిపుణత సంపాదించుకున్నారు. ఆయన విద్వత్తుకి గౌరవపురస్సరంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మ శాంతి కలగాలని, మోక్షం ప్రసాదించమని ఈశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాం.వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఓం శాంతి.. ఓంశాంతి ఓం శాంతి..’’ అని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై సూర్యకాంత్ బాలికి అపారమైన పట్టు వుండేది. 1987 ప్రాంతంలో ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ కి అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత జీన్యూస్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. రాజకీయంపై, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విశేషమైన రచనలు చేశారు.