దెయ్యం పోవాలని పాస్టర్ దెబ్బలు… యువకుని మృతి
దెయ్యాన్ని వదిలిస్తానంటూ పంజాబ్లో ఓ పాస్టరు చేసిన చికిత్స ‘వికటించింది.’ దెయ్యాన్ని పారదోలడం పేరుతో అతడు కొట్టిన దెబ్బలకు 30 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గురుదాస్ పూర్ జిల్లాలోని సంఘపురాకు చెందిన శామ్యూల్ మాసిహ్ అనే దినసరి కూలీ నిత్యం అనారోగ్యానికి గురయి కేకలు వేస్తుండేవాడు. దాంతో కుటుంబ సభ్యులు స్థానిక పాస్టర్ జాకోబ్ మాసి్హను సంప్రదించగా బుధవారం వారి ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశాడు.
అతనికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించడానికి అతణ్ని కొడుతామని చెప్పాడు. కొట్టినా ఏమీ కాదని భరోసా ఇచ్చాడు. అనంతరం ఆయనతో పాటు మరో ఎనిమిది మంది శామ్యూల్ను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజున శవానికి సమాధి చేశారు. కానీ రెండు రోజుల తరువాత శామ్యూల్ తల్లి, భార్య పాస్టరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సమాధి నుంచి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. పాస్టర్తో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు.