దేశ వ్యతిరేక ప్రచారంచేసే అకౌంట్లపై చర్యలు తీసుకోండి : రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశం
సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ వ్యతిరేక ప్రచారంపై ఓ నిఘా వేసి వుంచాలని కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గాం ఉగ్రదాడికి భారత జవాన్లు ఇస్లామిక్ ఉగ్రవాదులపై ప్రతీకార చర్యకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది. అయితే.. భారత ప్రభుత్వం వీటిపై ఎప్పటికప్పుడు కన్నేసి, తిప్పికొడుతూ వస్తోంది. అలాగే కొందరు సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సిందూర్ పై సెటైర్లు, విమర్శలు చేస్తూ, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఈ ముఖ్య సూచన చేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి, భారత్ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆ సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది.