నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ

వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన నిరుపేద మహిళలకు ఓ ప్రవాస భారతీయుడు రూ. 50,000 విలువచేసే కుట్టు మిషన్లను పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.జిల్లాలోని ఎండపెల్లి మండలం గొల్లకోట గ్రామానికి చెందిన జల్లెల కిరణ్ కుమార్ ఖతార్ దేశం లో ఓ కంపెనీ కి అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా గత సంవత్సరం నుండి నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఇప్పటివరకు వందమంది మహిళలకు శిక్షణ అందించారు. శిక్షణ అనంతరం నిర్వహించిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా వీక్షించిన కిరణ్ కుమార్ కొంతమంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని సంకల్పించి రూ. 50,000 విలువచేసే 6 కుట్టుమిషన్లను తిరుపతి ఫౌండేషన్ ద్వారా కుట్టు శిక్షణ కేంద్రానికి అందించారు.
కిరణ్ కుమార్ సూచన మేరకు శిక్షణ పొందిన వారిలో అత్యంత నిరుపేద మహిళలను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన ఆరుగురు మహిళలకు శుక్రవారం శిక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ కుమార్ సోదరుడు మూల శ్రీనివాస్, తిరుపతి ఫౌండేషన్ సభ్యులు మహేష్, తిరుపతి, మల్లికార్జున్, రాజు తదితరుల చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా ఆవాసం అధ్యక్షులు జిడిగే పురుషోత్తం మాట్లాడుతూ వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా సమాజం లోని నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ అందించి వారిని ఆర్థికంగా ఎదిగేవిధంగా చూడాలనే సంకల్పంతో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేసిన కిరణ్ కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాస సభ్యులు సంపూర్ణ చారి, గౌరీశెట్టి హరీష్, కైలాసం, లక్ష్మీనారాయణ,సత్యనారాయణ,మల్లేశం, శిక్షకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *