పహల్గాంలో తిరిగి తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివున్న పర్యాటక ప్రాంతాలు దశలవారీగా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రద్దీతో పలు చోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది.
పర్యాటకుల తాకిడితో జమ్మూ-కశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అయితే మూసివున్న తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరచుకోనున్నట్లు జమ్మూ-కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవల ప్రకటించారు.