పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ : త్రివిధ దళాల ప్రకటన

పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్నీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ స్పష్టం చేశారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతోనే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వారు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఉదయం వారు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరులకు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే ఈ మీడియా సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన దృశ్యాలను కూడా చూపించారు.

పహల్గామ్‌లో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతిచెందారని చెప్పారు. పహల్గామ్‌ దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని, విజయవంతంగా ధ్వంసం చేశామని అధికారులు ప్రకటించారు.

కర్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఓ క్రమ పద్ధతిలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మించుకుందన్నారు. ఇది కాస్తా ఉగ్రవాద శిబిరాలకు, లాంచ్ ప్యాడ్ లకు అత్యంత సురక్షితమైన స్వర్గధామం అయ్యిందన్నారు. తాము ఈ దాడుల్లో ఏ సైనిక స్థావరాన్ని కూడా లక్ష్యంగా చేసుకోలేదని తేల్చి చెప్పారు. సవాయి నాలా, బహవల్పూర్ లోని ముఖ్యమైన ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులకు దిగినట్లు ప్రకటించారు.

ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, అలాగే తమ దాడుల్లో పౌరులు కూడా మరణించినట్లు నివేదికలే లేవని వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ ప్రకటించారు. పాక్ ఏమైనా స్పందించినా, పరిస్థితిని మరింత జటిలం చేయడానికి సిద్ధమైనా… వాటికి ప్రతిస్పందించేందుకు భారత సాయుధ దళాలు పూర్తి సన్నద్ధంగానే వున్నాయని ప్రకటించారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, విజయవంతంగా ధ్వంసం చేశామని ప్రకటించారు. పౌరులకు, వారి మౌలకి సదుపాయాలకు ఏమాత్రం భంగం కలగకుండా, పౌరులు ప్రాణాలు కోల్పోకుండా వుండడానికే ఈ స్థావరాలను ఎంపిక చేశామని తెలిపారు.

అలాగే నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించామని కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అందులో తొమ్మిదింటిని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. అర్ధరాత్రి 1.05 -1.30 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగిందన్నారు. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్ కి 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో వున్న లష్కరే తోయ్యబా ఉగ్రవాద శిబిరం కూడా వుందని, ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *