పహల్గామ్ ఉగ్రదాడి : 28 కి చేరిన మృతుల సంఖ్య
జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గావ్ లో పర్యాటకులను చుట్టుముట్టి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారు. అంతేకాకుండా మీరు ముస్లింలా? అని అడిగి, హిందువులమని పర్యాటకులు సమాధానమిచ్చిన మరుక్షణమే కాల్పులు జరిపారు.
మృతుల్లో ఇద్దరు విదేశీయులు (ఇజ్రాయెల్, ఇటలీ దేశస్థులు), ఇద్దరు స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ గుర్రపు స్వారీ చేస్తున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండడంతో బాధితులను తరలించడం కష్టమైంది. బైసారన్లో కాల్పుల శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలించారు.తొలుత మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ… ఆ తర్వాత మృతుల సంఖ్య 28 కి చేరింది.