పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ : స్పీకర్ అనుమతి
అరకు కాఫీకి పార్లమెంట్ లో స్థానం లభించింది. పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు స్పీకర్ ని కలిసి, అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు రామ్మోహన్నాయుడు స్పీకర్కు తెలిపారు.
అరకు కాఫీ ప్రత్యేకతకు మంచి ఆదరణ లభిస్తుందని, దీర్ఘకాలిక మార్కెట్ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ కాఫీ ఉత్పత్తి ద్వారా స్థానిక రైతులకు కూడా లాభాలు చేకూరుతాయని ఎంపీల బృందం పేర్కొంది.
ఇక.. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమం నిర్వహణకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పర్మినెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెడితే.. దానికి మరింత గుర్తింపు లభిస్తుందని, దేశవ్యాప్తంగా కాఫీ ప్రేమికుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని పేర్కొన్నారు.