‘‘పినాక’’ రెజిమెంట్ల కోసం 10 వేల కోట్ల సామాగ్రి కొనుగోలుకు కేంద్రం ఓకే
సైన్యం కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. 10 వేల కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కొనుగోలు కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. చైనాతో ఉత్తర సరిహద్దు వెంబడి భారత్ తన సైనిక శక్తిని బలోపేతం చేస్తున్న నేపథ్యంలో మరో ఆరు పినాక రెజిమెంట్ల కోసం.. మందుగుండు సామగ్రిని ఈ ఒప్పందం ద్వారా సేకరించనున్నారు. భారత సైన్యం వద్ద ఇప్పటికే నాలుగు రెజిమెంట్ల పినాక రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా స్వదేశీ కంపెనీల నుంచి పినాక రాకెట్లు, మందుగుండును కొనుగోలు చేయనున్నారు. కాగా, శత్రు స్థావరాలను, లక్ష్యాలను సెకన్ల వ్యవధిలో ధ్వంసం చేయగల సత్తా పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (ఎంబీఆర్ఎల్) వ్యవస్థ సొంతం. సోవియెట్ కాలంనాటి గ్రాడ్ బీఎం-21 రాకెట్ లాంచర్ స్థానంలో పినాక ఎంబీఆర్ఎల్ను రూపొందించారు. కార్గిల్ యుద్ధంలో మొదటిసారిగా దీన్ని మోహరించారు.