పుస్తకాలతోనే అసలు చరిత్ర తెలిసేది.. వాట్సాప్ తో కాదు : రాజ్ థాకరే
అసలు చరిత్ర పుస్తకాలను చదివే తెలుసుకోవాలి గానీ.. వాట్సాప్ చూస్తే రాదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. అలాగే చరిత్రను కులం, మతం అనే కోణంలో చూడొద్దన్నారు. వాట్సాప్ వేదికగా వచ్చే చరిత్ర అంశాలను అస్సలు నమ్మవద్దన్నారు. గుడిపడ్వా సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
మొఘలులు ఛత్రపతి శివాజీ అన్న ఆలోచననే చంపేయాలని చూశారని, కానీ వారు విఫలమయ్యారన్నారు. అయితే.. ఈ ఆలోచన కాకుండా.. మొఘలులను ఎలా తుడిచిపెట్టేశామో ప్రపంచానికి చెప్పాలన్నారు. అందుకే పుస్తకాలను చదివి, చరిత్రను గ్రహించాలన్నారు. హిందువులు ఏదైనా సినిమా చూసినప్పుడే మేలుకోవడం వల్ల ప్రయోజనం లేదని, విక్కీ కౌశల్ వల్ల శంభాజీ మహారాజ్ త్యాగాల గురించి, అక్షయ్ ఖన్నా వల్ల ఔరంగజేబు గురించి తెలుసుకున్నారా” అని ప్రశ్నించారు.
అలాగే రోడ్లపై ముస్లింల నమాజ్ గురించి కూడా ప్రస్తావించారు. మతం అనేది నాలుగు గోడల మధ్యే వుండాలని, కానీ.. ఇప్పుడు ముస్లింలు రోడ్ల మీదకు వచ్చినప్పుడో, ఘర్షణల సమయంలోనో హిందువును హిందువుగా గుర్తిస్తున్నారన్నారు. లేకపోతే హిందువులు కులం ఆధారంగా చీలిపోతున్నారన్నారు.