బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని ABPS తీర్మానం

బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై నిరంతరాయంగా జరుగుతున్న హింస, అన్యాయం, అణచివేతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీ ఛాందసుల శక్తులు ప్రణాళికా బద్ధంగా హింస చేస్తున్నాయని పేర్కొంది. బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు హిందువులపై జరుగుతున్న అమానవీయ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించే బాధ్యతను తీసుకోవాలని ABPS అభిప్రాయపడింది. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, హింసాత్మక కార్యకలాపాలు నిలిపేసేలా ఒత్తిడి తేవాలని కూడా కోరింది.
హిందువులపై, మైనారిటీపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని పేర్కొంది. అలాగే అక్కడ వుండే మఠాలపై, దేవాలయాలపై, దుర్గాపూజ మండపాలపై, విద్యా సంస్థలపై, విద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దేవతలను అపవిత్రం చేయడం, అనాగరిక హత్యలు, ఆస్తులను దోచుకోవడం, మహిళలను అపహరించడం , వేధించడంతో పాటు బలవంతపు మత మార్పిళ్లు కూడా జరిగాయని పేర్కొంది.
ఈ సంఘటనలకు రాజకీయ ఉద్దేశాన్ని ఆపాదిస్తే.. మతపరమైన కోణాన్ని, సత్యాలను తిరస్కరించినట్లేనని అభిప్రాయపడింది. ఈ ఘటనల్లో ఎక్కువ మంది హిందువులు, మైనారిటీలే బాధితులని సభ వివరించింది. అయితే.. బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు మతతత్వ ఇస్లామిక్ శక్తుల చేతుల్లో హింసింపబడటం కొత్తేమీ కాదని తెలిపింది.
బంగ్లాదేశ్ లో హిందూ జనాభా నిరంతరం తగ్గుతోందని, (1951 లో 22 శాతం వుంటే..ఇప్పుడు 7.95 శాతం) తెలిపింది. అయితే.. తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల వెనుక ప్రభుత్వ మద్దతుతో పాటు సంస్థాగత మద్దతు కూడా ఇస్లామిక్ ఛాందసులకు వుందని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ఇలాంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఒక దేశంపై మరొక దేశానికి అపనమ్మకం కలిగించడం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పి, భారత్ చుట్టూ వున్న ప్రాంతంలో అస్థిరత సృష్టించాలని కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపింది. పాకిస్తాన్, డీప్ స్టేట్ కార్యాకలాపాలపై, భారత వ్యతిరేకులపై నిరంతరం అప్రమత్తంగా వుండి, ఆ కార్యకలాపాలను వివరించాలని ABPS మేధావులకు పిలుపునిచ్చింది. భారత్ తో పొరుగు దేశాల సంబంధాలు బలోపేతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని మేధావులను కోరింది.
బంగ్లాదేశ్ లో అంత హింసాత్మక ఘటనలు జరిగినా అక్కడి హిందూ సమాజం వారి దురాగతాలను శాంతియుతంగా, సమష్టిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ధైర్యంగా ప్రతిఘటించిందని ABPS పేర్కొంది. అలాగే అక్కడి హిందువులకు, మైనారిటీలకు ప్రపంచ వ్యాప్తంగా వున్న సమాజం, హిందూ సమాజం నుంచి నైతిక మద్దతు, మానసిక మద్దతు లభించిందని, ఇది ఎంతో ప్రశంసనీయమని పేర్కొంది. భారత్ లోని హిందూ సంస్థలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందూ సంస్థలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశాయని, అక్కడి వారికి భద్రత కల్పించాలని కూడా డిమాండ్లు చేశాయని తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక మంది ఈ అంశాన్ని లేవనెత్తారని తెలిపింది.
హిందువులు, మైనారిటీల భద్రపై భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును అంతర్జాతీయ వేదికలపై కూడా ఎండగట్టిందని పేర్కొంది.బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం, గౌరవం కోసం, వారి శ్రేయస్సు కోసం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపింది. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలు చేయాలని కూడా కోరింది. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న అమానవీయ దాడులను తీవ్రంగా పరిగణించి, వారి కార్యకలాపాలను ఎండగట్టాలని, వాటిని అరికట్టడానికి బంగ్లా ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఐరాస, ప్రపంచ దేశాలపై వుందని ఏబీపీఎస్ అభిప్రాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *