బెంగళూరు వేదికగా ఏరో ఇండియా 2025… అట్టహాసంగా ప్రారంభం
బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్లో ఏరో ఇండియా-2025 వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిని ప్రారంభించారు. కాగా, ఐదు రోజులపాటు జరగనున్న ఈ షో కోసం ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేశారు. మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొననున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అప్డేటెడ్ టెక్నాలజీతో రష్యా ప్రదర్శనఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో మొదలైంది.
భారత్ తో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక. జనవరి 10 నుంచి 14వరకు జరగనుందీ ఎయిర్ షో. ప్రపంచ దేశాల యుద్దవిమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది.
అయితే ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన ఎస్యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్-35 లైట్నింగ్ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్ షోలు జరగ్గా, ఇది 15వ ఎయిర్షో. అలాగే ప్రతీసారి బెంగళూరే ఎయిర్షోకి అతిథ్యమిస్తూ వస్తోంది. ఎయిర్ షో చూసేందుకు పలురాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఎయిర్ షో సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు ఆకాశంలో గర్జించాయి. ఎయిర్ క్రాఫ్ట్లు చేసిన అద్భుత విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. తొలివిడత కార్యక్రమంలో భాగంగా తేజస్ బృందానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వం వహించారు. హాల్ అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అనంతరం మహిళా పైలట్లు రాఫెల్ యుద్ధ విమానాలను నడిపి మహిళా శక్తి చాటారు.
ఐఏఎఫ్ కి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ (ఎస్కేఏటీ) వివిధ రూపాలు ప్రదర్శించడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తొమ్మిది హాక్ ఎంకే 132 విమానాలను దగ్గరగా తీసుకొచ్చి చేసిన విన్యాసం, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తీరు అందర్నీ ఆకర్షించింది.ఫైటర్ జెట్లు తొలిసారి అమెరికాకు చెందిన యుద్ధవిమానం లఖీద్ మార్టిన్ ఎఫ్35 లైటినింగ్ 2, రష్యాకు చెందిన సుఖోయ్-ఎ్సయూ-57 కూడా ఎయిర్షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాత ఐదవ తరం యుద్ధ విమానాలు అమెరికన్ ఎఫ్-35, రష్యన్ ఎస్యూ-57 భారత ఎయిర్షోలో పాల్గొనడం ఇదే తొలిసారి.