బ్రహ్మకుమారి చీఫ్ దాది రతన్ మోహిని మృతిపై ఆరెస్సెస్ సంతాపం
ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాదీ మృతిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.
‘‘గౌరవనీయ రతన్ మోహిని మరణం అందరికీ తీరని లోటు. ఆమె వైకుంఠ ధామానికి చేరుకున్నారు. ఆమెకు నివాళులు అర్పిస్తున్నాం. తన జీవితంలో వేలాది మంది బ్రహ్మ కుమారీలకు శిక్షణనిచ్చి, మార్గదర్శనం చేశారు. చాలా ముఖ్యమైన పనిని నిర్వర్తించారు. భారతీయ సంస్కృతిని, విలువలను పెంచడానికి ప్రయత్నం చేశారు.ఈ దు:ఖ సమయాన్ని సంస్థ అధిగమించే శక్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాం. ఓం శాంతి… ఓం శాంతి.. ఓం శాంతి..’’ అని ఆరెస్సెస్ తన సంతాపాన్ని ప్రకటించింది.
శతాధిక వృద్ధ మహిళ, ఆధ్యాత్మిక నేత, బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని కన్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిగా రతన్ మోహిని రికార్డు నెలకొల్పారు. అంతకుముందు దాది జానకి బ్రహ్మకుమారి సంస్థ చీఫ్గా చేశారు. దాది జానకి 1916, జనవరి ఒకటో తేదీన జన్మించి, 2020, మార్చి 27వ తేదీన మరణించారు. గత కొన్ని రోజుల నుంచి దాది రతన్ మోహిన్ ఆరోగ్యం సరిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. రాజస్థాన్లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివనంలోని ట్రామా సెంటర్కు డయాలసిస్ కోసం ఆమెను తరలించారు.
సోమవారం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకంగా మారింది. దీంతో క్రిటికల్ కండీషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 1.20 నిమిషాలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలో శాంతివనంకు ఆమె పార్ధీవదేహాన్ని తీసుకెళ్లనున్నారు.