భాగ్య విధాత ఛత్రపతి : దత్తాత్రేయ హోసబళే
హిందూ స్వరాజ్యం, దేశభక్తి కోసం తనను తాను అంకితం చేసుకున్న మహా పురుషుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఆ మహా పురుషుడు భారతదేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాడన్నారు. న్యూఢిల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి సంబంధించిన ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించారు. శ్రీ శివాజీ రాయగఢ్ స్మారక్ మంల్, శ్రీ భారతి ప్రకాశన్ సంస్థలు కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ దేశంలో దేశభక్తి భావాన్ని పెంపొందించాడని, మొఘలులను ఓడించి, హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించారన్నారు. హైందవీ స్వరాజ్య స్థాపన కోసం అహర్నిశలూ కృషి చేసేవారని,ఆయన చూపిన మార్గం వల్ల అటక్ నుంచి కటక్ వరకూ మరాఠాలు కాషాయ జెండాను ఎగరేశారన్నారు. ఈ పనుల వల్ల భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. భారత దేశానికి భాగ్యవిధాత అని దత్తాత్రేయ హోసబళే అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. భారత దేశానికి ఛత్రపతి శివాజీ అత్యుత్తమ పాలకుడని కొనియాడారు. భారత భాగ్యవిధాతకు సృష్టికర్త అని అన్నారు. శివాజీ లాంటి గొప్ప యోధుడి శకం భారత్ లో లేకపోతే భారతీయ సంస్కృతి పతాక ఇంత బలంగా వుండేది కాదని అభిప్రాయపడ్డారు.సంస్కృతి, ధర్మాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తూ పరిపాలన సాగించారన్నారు.