భారతీయ నారీ శక్తికి ప్రతిరూపాలు… దేశాన్ని విశేషంగా ఆకర్షించిన సివంగులు
ఆపరేషన్ సిందూర్… ఓ సంచలనం. తొమ్మిది ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం విజృంభించింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. అదే సమయంలో ఓ ఇద్దరు ప్రపంచం మొత్తాన్ని, మరీ ముఖ్యంగా భారత ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రజలకు తెలియజేయడానికి త్రివిధ దళాలు బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ మీడియా సమావేశంలోనే ఓ ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు దేశ ప్రజల్ని విశేషంగా ఆకర్షించారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్ చర్చించుకుంటోంది. కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ క్లిష్టమైన ఆపరేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు.. వీరి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్..
పైలెట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కల. అందుకోసం ఎంతో కష్టపడ్డారు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యోమికా.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 2004లో ఐఏఎఫ్లో చేరారు ఆమె. 2017లో వింగ్ కమాండ్ హోదా పొందారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేతక్, చీతా హెలికాఫ్టర్లను నడిపి రికార్డు సృష్టించారు వ్యోమికా సింగ్. వైమానికి రంగంలో ఎంతో పేరు పొందారు. హై-రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్లలో వ్యోమికా సింగ్ సేవలందించారు. చిన్నతనం నుంచే విమానాలు నడపాలన్నది ఆమె కాంక్ష. కేవలం కలలు కనడమే కాకుండా వాటిని సాకారం కూడా చేసుకున్నారు.
కర్నల్ సోఫియా ఖురేషి
సోఫియా ఖురేషీ స్వస్థలం గుజరాత్. 1990లో సోఫియా సైన్యంలో చేశారు. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి.. 2016లో పుణెలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి తొలి మహిళా అధికారణిగా చరిత్ర సృష్టించారు. ఇందులో 18 దేశాలు పాల్గొనగా.. కేవలం భారత్ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించారు. ఆమెకు పీస్ కీపర్గా ఎంతో అనుభవం ఉంది. 2006 కాంగోలో పీస్ మిషన్కు ఆమె అందించిన సహకారం ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం. మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలందించారు. ఆమె రాజీలేని వైఖరి, నిర్భయ ప్రయత్నాలతో ఎన్నో ప్రశంసలను అందుకున్నారు.ఈసారి ఆపరేషన్ సింధూర్కు గ్రౌండ్ లెవల్ ఇంటెలిజెన్స్ మరియు కార్యాచరణ ప్రణాళికల తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆమె నాయకత్వం వహించిన యూనిట్, టెర్రరిస్ట్ క్యాంపుల ఖచ్చితమైన లొకేషన్లను గుర్తించి, సమర్ధవంతంగా చర్యలు చేపట్టింది.