భారతీయ స్త్రీకి ప్రతిరూపం హోల్కర్ : దత్తాత్రేయ హోసబళే
భారత భూమి పుణ్య భూమి అని, ఎల్లప్పుడూ ధైర్యవంతులైన, సాహసవంతులైన మహిళలకు, ప్రజావీరులకు తల్లిగా వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ముంబైలో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ గొప్ప వ్యక్తిత్వం వున్న మహిళ అని, భారతీయ పరంపరలో సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ప్రతీకగా నిలబడిపోయారన్నారు.
అతి తక్కువ సమయంలోనే ఆదర్శవంతమైన పాలనను అందించడమే కాకుండా, సామాజిక సమరసత, న్యాయం, భద్రత అన్న మూలాలతో బలమైన పునాదులు కూడా వేశారని కొనియాడారు. అహల్యాబాయి హోల్కర్ భారతీయ స్త్రీ తత్వానికి ప్రతిరూపమని, కాలానికి అతీతంగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
ఇక.. ఇదే కార్యక్రమంలో హోల్కర్ వారసుడు ఉదయరాజే హోల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహల్యాదేవి ఓ దార్శనిక పాలకురాలు అని అభివర్ణించారు.మహేశ్వర్ లో సూర్య గడియారాన్ని నిర్మించారని, దీని ద్వారా భారత దేశ సాంస్కృతిక, ఖగోళ, శాస్త్రీయ చైతన్యాన్ని వృద్ధి చేశారని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు గోమాతే వెన్నెముక అని బలంగా విశ్వసించారని, గోమాత రక్షణ ద్వారానే శ్రేయస్సు సాధ్యమని బలంగా నమ్మేవారని గుర్తు చేశారు.