భారత్ అభివృద్ధిలో ముందుంటే.. పాక్ అప్పులు చేయడంలో బిజీ : భారత్
భారత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం మతోన్మాదం, ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయిందని చెప్పారు. అలాగే ఆ దేశం అప్పులు తీసుకోవడంలోనే చాలా బిజీగా ఉందని దెప్పిపొడిచారు.ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ అధ్యక్షతన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవటం ద్వారా అంతర్జాతీయంగా శాంతి, భద్రతలను ప్రోత్సహించాలనే అంశంపై ఓపెన్ డిబెట్ జరిగింది.
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్, సింధు నదీ జలాల అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ గట్టిగా తిప్పికొట్టారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాక్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు. అలాగే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం సరికాదని విమర్శించారు.
సమావేశానికి పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అధ్యక్షత వహించగా.. ఆయన జమ్మూ కాశ్మీర్, సింధు నదీ జలాల ఒప్పందం వంటి అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఒకవైపు భారత్ ప్రజాస్వామ్య, ఆర్థిక పురోగతిని సాధిస్తుంటే… మరోవైపు పాకిస్థాన్ మతోన్మాదం, ఉగ్రవాద సమస్యలతో సతమతమవుతోందని హరీష్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించిందని, ఆ తర్వాత భారత్ “ఆపరేషన్ సింధూర్” ద్వారా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుందని హరీష్ వివరించారు.