ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ ఆమోదం కాదు : విశ్వహిందూ పరిషత్

కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు (reservation for Muslims) కల్పిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని విశ్వహిందూ పరిషత్ సెక్రెటరీ జనరల్ బజరంగ్ బాగ్రా అన్నారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల ద్వేషంతో వుందని, హిందువులను కించపరుస్తోందని మండిపడ్డారు. వీటి ద్వారా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
మరోవైపు హిందూ ఓబీసీ కోటా నుంచి తగ్గించి, ముస్లింలకు ఇచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయని, హిందూ ఓబీసీల హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. దీనిని విశ్వహిందూ పరిషత్ ఏమాత్రం ఆమోదించదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు.
మరో వైపు కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు  కల్పిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజ్యసభను అట్టుడికించింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరిస్తుందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బిజెపి సభ్యులు రాజ్యసభలో తీవ్రంగా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళనకు దిగారు. దీంతో ఇవాళ రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ విషయాన్ని సభలో లేవనెత్తగా బిజెపి సభ్యులు కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *