యుద్ధం భారత్ అభిమతమే కాదు : అజిత్ దోవల్
యుద్ధం అనేది భారత దేశ అభిమతం కానేకాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు.పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ తర్వాత వాంగ్ యీతో డోభాల్ ఫోన్లో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని గురించి ఆయనకు వివరించి, 26 మంది ఆ ఘటనలో మృతిచెందినట్లు వివరించారు.శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయని,అయితే ఒప్పందం జరిగిన నాలుగు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని అజిత్ దోవల్ తెలిపారు.
కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ ఒప్పంద ఉల్లంఘనకు తెగబడింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని అనేక నగరాలపై డ్రోన్ల దాడి కొనసాగింది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పూర్తి స్థాయిలో ఎదుర్కొనాలని బీఎస్ఎఫ్ను ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
శ్రీనగర్తోసహా జమ్ము కశ్మీర్లోని అనేక చోట్ల పేలుళ్లు సంభవించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు రోజుల్లో ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా పేర్కొన్నాయి. కశ్మీర్లోని బారాముల్లాతోపాటు రాజస్థాన్లోని పోఖ్రాన్లో పాకిస్థానీ డ్రోన్లను భారత భద్రతాదళాలు కూల్చివేశాయి. శ్రీనగర్తోపాటు రాజస్థాన్లోని జైసల్మేర్లో శనివారం రాత్రి విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేసి బ్లాకౌట్ విధించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెండి అఖ్నూర్, రాజౌరీ, ఆర్ఎస్ పురా సెక్టార్లలో పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. జమ్ముకు చెందిన పలన్వాలా సెక్టార్లో ఎల్ఓసీ వెంబడి కూడా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. బారాముల్లాలో భారత దళాలు ఓ డ్రోన్ను పేల్చివేశాయి. బారాముల్లాలోనే అనుమాస్పద మానవరహిత గగనతల వాహనాలు(యూఏవీలు) కనిపించాయి.