యూరీ సెక్టార్ లో ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదుల హతం
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే కీలక పరిణామం జరిగింది. భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్ లోని యూరీ సెక్టార్ గుండా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరు అత్యంత ఆధునికంగా శిక్షణ తీసుకున్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి.
ఇస్లామిక్ ఉగ్రవాదులు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేయగా… భారత సైన్యం ఈ కుటిల ప్రయత్నాన్ని వెంటనే గుర్తించింది. మరుక్షణమే కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి.
ఈ సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, యుద్ధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు నక్కి వున్నారా? అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.