రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ ప్రతినిధిసభ, బెంగళూరు

యుగాబ్ది 5122, 19-20 మార్చ్, 2021

‌తీర్మానం 1

శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం

శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్‌ అం‌తర్నిహిత శక్తిని మరింత బలపరచడమేకాక ఇవి ఆధ్యాత్మిక జాగృతి, జాతీయ సమైక్యత, సద్భావన, శ్రద్దలకు ప్రతీకగా నిలుస్తాయని అఖిల భారతీయప్రతినిధి సభ భావిస్తున్నది.

భాద్రపద కృష్ణ ద్వితీయ, యుగాబ్ది 5122 (2020 ఆగస్ట్ 5) ‌రోజున గౌరవనీయ భారత ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పూజ్య సర్‌ ‌సంఘచాలక్‌, శ్రీ ‌రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‌సభ్యులు, గౌరవ నీయ సాధుసంతులు, వివిధ మత సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యుల సమక్షంలో ప్రారంభమయిన మందిర నిర్మాణ కార్యక్రమాన్ని యావత్‌ ‌ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. సమస్త పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టిని, అన్ని నదుల లోని నీటిని ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. కోవిడ్‌19 ‌పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి హాజరైనవారి సంఖ్యను పరిమితం చేసినా ఆ కార్యక్రమపు ప్రభావం మాత్రం అపరిమితంగానే ఉంది. ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నవారి సంఖ్య పరిమితమైనా హిందూ సమాజం మొత్తం దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా అందులో పాలుపంచుకుంది. సమాజంలోని అన్ని వర్గాలవారు, అన్ని పార్టీలవారు ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

మకర సంక్రాంతి రోజున దేశ ప్రధమ పౌరుడు, భారత రాష్ట్రపతి, ఢిల్లీలోని భగవాన్‌ ‌వాల్మీకి మందిరం నిధి సమర్పణ చేయడంతో ప్రారంభ మయిన 43రోజుల ‘నిధిసమర్పణ అభియాన్‌’ ‌ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాకార్యక్రమం. దేశవ్యాప్తంగా 5.5 లక్షల నగరాలు, గ్రామాల నుంచి 12కోట్లకు పైగా రామభక్త కుటుంబాలు భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సమర్పించాయి. సమాజంలోని అన్ని పంథాలు, మతాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ అభియాన్‌లో పాల్గొన్నారు. గ్రామ, నగరవాసులు, వనవాసీ బంధువులు, ధనికులు, పేదలు మన స్ఫూర్తిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి అపూర్వమైన స్పందన, ఉత్సాహం, మద్దతు చూపిన రామభక్తు లందరిని అఖిల భారతీయ ప్రతినిధిసభ అభినందిస్తున్నది.

శ్రీ రామునితో ఈ దేశం భావాత్మకంగా ముడిపడి ఉన్నదనే విషయాన్ని ఈ అభియాన్‌ ‌మరోసారి నిరూపించింది. శ్రీ రామునితో ముడిపడి ఉన్నదంటే అర్ధం శ్రీరాముని ఆదర్శాలను మన వ్యక్తిగత, సామాజిక జీవనంలో సార్ధకం చేసుకోవడానికి తగిన కృషి మరింత వేగవంతం కావాలి. ఆదర్శాలు సమాజంలో వ్యాప్తి చెందడానికి సామాజిక, మత సంస్థలు, విద్యావేత్తలు, మేధావులు, సమస్త రామభక్తులు కృషి చేయాలని ప్రతినిధిసభ కోరుతున్నది. అయోధ్య శ్రీ రామజన్మ భూమిలో మందిర నిర్మాణంతోపాటు సామూహిక సంకల్పం, కృషి ద్వారా శ్రీ రాముని ఆదర్శంతో ప్రేరితమైన సమాజం, జాతీయ జీవనం నిర్మాణం కాగలుగుతుంది. దీని ఆధారంతోనే ప్రపంచానికి మేలుచేసే వైభవోపేతమైన, పటిష్ఠమైన భారత నిర్మాణం జరుగుతుంది. ప్రపంచంలోనే భారత్‌ ‌మంగళప్రదమైన పాత్రను నిర్వహిస్తుంది.

తీర్మానం 2

కోవిడ్‌ 19 ‌మహమ్మారికి వ్యతిరేకంగా ఒక్కటై నిలచిన భారత్‌

‌ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్‌19 ‌సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్‌ ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని అన్నివర్గాలవారూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

మహమ్మారి క్రమంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగం కార్యరంగంలోకి దిగాయి. వ్యాధి లక్షణాలు, దాని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడానికి దేశ వ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది. ఇందులో ప్రసార మాధ్యమాలు కూడా సకరాత్మకంగా వ్యవహరించడంవల్ల పెద్ద జనజాగరణ కార్యం జరిగింది. దేశ ప్రజానీకం మొత్తం ఒక్కటిగా నిలబడి నిబంధనలను తెలుసు కుని, సక్రమంగా పాటించడంతో ఎదురవు తుందనుకున్న పెను ప్రమాదం, నష్టం తప్పింది. తమ ప్రాణాలను సైతం పణంగాపెట్టి సవాళ్లను స్వీకరిస్తూ డాక్టర్‌లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి, రోగులకు వైద్యం అందించారు. పారిశుధ్య కార్మికులు కూడా విలువైన సేవలనందించారు. ఇటువంటి సంక్షోభకాలంలో కూడా దైనందిన కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోకుండా భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలు, నిత్యావసర సేవలు, ఆర్ధిక సంస్థలు, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలు క్రియాశీలంగా పనిచేశాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చేపట్టిన ‘శ్రామిక్‌ ‌రైళ్లు’, ‘వందేభారత్‌ ‌మిషన్‌’, ‌ప్రస్తుతపు టీకా పంపిణీ వంటి కార్యక్రమా లన్నీ ఎంతో ప్రశంసించదగినవి.

ఈ మహమ్మారితో పోరాటంలో నిస్వార్ధ సేవలందిస్తూ అనేకమంది కరోనా యోధులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. అటువంటి వారి ధైర్యాన్ని, త్యాగనిరతిని ప్రతినిధిసభ అత్యంత కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటున్నది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నది.

హఠాత్‌ ‌పరిణామాలతో ఎంతో ఇబ్బందులకు, బాధలకు గురైన లక్షలాదిమందిని ఆడుకునేందుకు ఆహారాన్ని, వైద్య సహాయాన్ని, రవాణా సదుపాయాన్ని, ఆర్ధిక సహాయాన్ని అందించడానికి భారతీయ సమాజం మొత్తం ముందుకు వచ్చిన వైనం, చూపిన సంవేదన అద్భుతమైనవి. అవసరం ఉన్నవారిని ఆదుకోవడం కోసం సాధారణ ప్రజానీకం, వివిధ స్వచ్ఛంద సంస్థలు స్పందించి బాధితుల ఇళ్లకి వెళ్లి సేవలు అందించాయి. ఇటువంటి నిస్వార్ధ, సంవేదనశీలమైన సేవలను అందించిన వ్యక్తులు, సంస్థలన్నిటిని అఖిల భారతీయ ప్రతినిధిసభ ఎంతగానో అభినందిస్తున్నది.

కోవిడ్‌ ‌వ్యాప్తి మూలంగా, దానిని అరికట్టడానికి విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌వలన వలస కార్మికులు, శ్రామికులవంటివారు ఎందరో, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా మన సమాజం ఈ కష్టాలను, ఇబ్బందులను, అనిశ్చితిని ప్రశంస నీయమైన పట్టుదలతో, ధైర్యంతో ఎదుర్కొన్నది.

సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, నగరాల నుండి పెద్ద ఎత్తున వలసల మూలంగా గ్రామాల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదురవు తాయని భావించినా పరిస్థితులు మాత్రం ఏ దశలోనూ చేయిదాటిపోలేదు. నిజానికి నగరాల నుండి తిరిగి వస్తున్న వారికి స్థానికులు అందించిన సహకారం, మద్దతు ప్రశంసనీయమైనవి.

ఈ విపత్కర కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి సాధారణ స్థితిలోకంటే ఎక్కువగా ఉంది. పారిశ్రామిక రంగంతోపాటు మొత్తం ఆర్ధిక స్థితి ఆశాజనకంగానే ఉంది. ఈ కఠిన పరిస్థితులను కూడా ఒక అవకాశంగా మలుచుకుని వెంటి లేటర్‌లు, పీపీఇ కిట్‌ల తయారీ, కరోన పరీక్షలలో కొత్త సాంకేతిక పద్ధతులు, అత్యంత త్వరితంగా చవకైన, ప్రభావవంతమైన స్వదేశీటీకా తయారీ వంటివి సాధించాము. కష్టనష్టాలను ఎదుర్కొని నిలవడంలో సమాజపు అంతర్నిహితమైన స్థైర్యం, సహిష్ణుత మరొకసారి ఆవిష్కృతమైనాయి. ఈ ప్రపంచవ్యాప్త సంక్షోభ సమయంలో కూడా ‘వసుధైక కుటుంబకం’ అనే భావనకు కట్టుబడిన భారత్‌ అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ‌మాత్రలతోపాటు అత్యవసర వస్తువులను పంపిణీ చేసింది. ఆ తరువాత ‘టీకా మైత్రి’ కార్యక్రమం క్రింద అనేక దేశాలకు వాక్సిన్‌ అం‌దిస్తున్నది. సమయానికను గుణంగా భారత్‌ అం‌దించిన అంతర్జాతీయ సహకారాన్ని, భారతదేశ భూమికను ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు ప్రశంసిస్తున్నారు.

ఈ మహమ్మారి మూలంగా మన సంపూర్ణ వైశ్విక దృష్టికి ఉన్న శక్తిని, ప్రాచీన, వికేంద్రీకృత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ గొప్పదనాన్ని మరొకసారి తెలుసుకోగలిగాము. సంప్రదాయ విలువలపై ఆధారపడిన నిత్యజీవితపు అలవాట్లు, ఆచారాలు, కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడం, మితాహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, సంప్రదాయ ఆహారపు అలవాట్లు, పరంపరాగత ఔషధసేవనం రోగనిరోధకశక్తిని పెంచింది. యోగా, ధ్యాన పక్రియల సకరాత్మక ప్రయోజనం మొదలైనవి ఈ కాలంలో మనకు ఎంతో మేలు చేకూర్చాయి. భారత్‌ ‌లో కనిపించే ఈ సమీకృత దైనందిన జీవన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు చూసి ఆమోదించి, ప్రశంసించారు.

మహమ్మారి మూలంగా కలిగిన దుష్ఫలితాలు, పరిణామాల నుంచి అదే పట్టుదల, సామర్ధ్యంతో బయటపడి భారతీయ సమాజం శీఘ్రగతిన సాధారణ జీవనస్థితికి చేరుకుంటుందని అఖిల భారతీయ ప్రతినిధిసభ విశ్వసిస్తున్నది. అయితే కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక మహమ్మారి వ్యాప్తి చెందకుండా అవసరమైన మార్గదర్శక నిబంధనలు, జాగ్రత్తలను తూచ తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. ఈ సంక్షోభ కాలంలో నేర్చుకున్న పాఠాలను మన వ్యక్తిగత, సామాజిక జీవనంలో నింపుకుని ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను, సంయమనంతో కూడిన వనరుల వినియోగాన్ని, పర్యావరణ సంరక్షణ వంటివి సాధించాలని, ‘స్వదేశీ’ భావనను మనమన జీవితా లలో అలవరచుకోవాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ యావత్‌ ‌సమాజానికి పిలుపునిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *