రేపే అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్… కేంద్ర హోంశాఖ ఆదేశాలు
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్తో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
సమర్థవంతమైన పౌర రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లను పరీక్షించాలని, దాడి జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని, ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరెన్ల పనితీరును పరీక్షించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
కాగా, అత్యవసర సమయంలో విజిబిలిటీని తక్కువ చేసేందుకు క్రాష్ బ్లాక్అవుట్ చర్యలు, కీలకమైన ప్లాంట్లు, ఇన్స్టాలేషన్లను కాపాడుకునేందుకు మభ్యపెట్టే విధంగా చర్యలు చేపట్టడం, జాతీయ ముప్పు ఎదురైనప్పుడు ప్రజల్లో అవగాహన పెంచడం, వేగంగా ప్రతిస్పందించడం, ప్రజలను ఖాళీ చేయించే ప్రణాళికలు, రిహార్సల్ వంటివి ఈ మాక్ డ్రిల్ లక్ష్యాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. భారత్ దాడులకు పాక్ ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఒకవేళ పాక్ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై అందర్నీ సన్నద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది.
ఇప్పటికే సరిహద్దుల్లో కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ దేశంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో భారత్, పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ కేంద్రం ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని చెప్పిన కేంద్రం తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పింది.
ఈ మాక్ డ్రిల్లో ఏదైనా దాడి జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలో సాధారణ పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇస్తారు. బ్లాకౌట్ కోసం ఏర్పాట్లు స్తారు. అవసరమైతే, శత్రువు ఏ లక్ష్యాన్ని చూడకుండా విద్యుత్ని నిలిపివేస్తారు. కీలక కర్మాగాలను, స్థావరాలను గుర్తించకుండా ఏర్పాటు చేస్తారు. ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించారు.అత్యవసర సంసిద్ధతను పరీక్షించడానికి స్టేషన్ కమాండర్, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడి ఆదేశాల మేరకు రాత్రి 9 నుంచి రాత్రి 9.30 వరకు నిర్వహించినట్లు ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గుర్జంత్ సింగ్ వివరించారు.