వందేమాతర స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల

భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నవంబర్ 7 ఒక చారిత్రకమైన రోజు. వందేమాతరం 150 ఏళ్ల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ పవిత్ర సందర్భం కోట్లాది మంది భారతీయులలో కొత్త స్ఫూర్తిని, శక్తిని నింపుతుంది. వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనం సాధించలేని కల ఏదీ లేదని గుర్తుచేస్తుంది” అని తెలిపారు. వందేమాతర సామూహిక గీతాలాపాన అద్భుతమైన అనుభవమని అన్నారు. ఒకేలయ, స్వరం, భావంతో గీతాలాపాన గుండెలను స్పందింపచేస్తుందని, ఈ స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణను కలిగిస్తాయని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూలం భావం, సందేశం ఉంటుందని, వందేమాతర గీతానికి మూలం, భావం, సందేశం భారత్ అన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీరులకు ఆయన నివాళులర్పించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. “ప్రాణత్యాగం చేసిన వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చివరిగా పలికిన మాట వందేమాతరం అయి ఉంటుంది. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారతీయులందరినీ ఏకం చేయగల శక్తి వందేమాతరానికి ఉంది” అని ఆయన అన్నారు. పౌరులు తమ గళంతో వందేమాతరం పాడి పంపేందుకు ఒక డిజిటల్ పోర్టల్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నచోటనే సామూహికంగా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. ఈరోజు ప్రారంభించిన ఈ వేడుకలు నవంబర్ 7, 2026 వరకు దేశమంతటా జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *