విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అనంత్నాగ్ జిల్లాకు చెందిన రషీద్ ఉగ్రవాదానికి అకర్షితుడైనట్లుగా భారత నిఘా వర్గాలు పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల కిందట దక్షిణ కశ్మీర్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడని సంబందిత వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, 2018లో విద్యార్థి వీసాపై ఆదిల్ పాక్కు వెళ్లాడని, అక్కడ లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్ తదితర ఉగ్రవాద గ్రూపుల్లో శిక్షణ తీసుకున్నట్లుగా సమాచారం. దాదాపు ఎనిమిది నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిల్.. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. గతేడాది అక్టోబర్లో ఆదిల్ ముగ్గురు పాక్ ఉగ్రవాదులతో కలిసి పూంచ్, రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట అక్రమంగా భారత్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా గుర్తించారు.
ఇందు కోసం అటవీ ప్రాంతాలను ఉపయోగించుకొని భద్రతా బలగాల కంట పడకుండా తప్పించుకొని కిష్త్వార్, అనంత్నాగ్ మీదుగా భారత భూభాగంలోకి చొరబడ్డట్లుగా అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అనంత్నాగ్లో అండర్గ్రౌండ్లోకి వెళ్లి స్థానిక ఉగ్రవాద నెట్వర్క్తో సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు, ప్రాణనష్టం ఎక్కువగా ఉండేలా పర్యాటకులు ఎక్కువగా కనిపించే పహల్గాంను దాడులకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి భద్రతా బలగాలకు బైసరన్ లోయ సవాల్గా ఉంటుంది. ఈ ప్రాంతం ఉగ్రవాదులు దాడి చేసి తప్పించుకునేందుకు వీలుగా ఉంటుందని, ఈ క్రమంలోనే ఈ ప్రాంతాన్ని దాడులకు ఎంచుకుంటున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా బైసరన్ తదితర పర్యాటక ప్రదేశాలను కొద్దిరోజుల మూసివేశారు. ఆయా ప్రాంతాల్లోకి తిరిగి పర్యాటకులను అనుమతించడంతో వ్యూహాన్ని అమలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం 1.50 గంట ప్రాంతంలో ఆదిల్ థోకర్ తోటి ఉగ్రవాదులతో కలిసి బైసరన్ పైన్ అటవీ నుంచి బయటకు వచ్చి పర్యాటకులను కాల్చివేశారు. ఇదిలా ఉండగా, ఆదిల్ హుస్సేన్ ఇంటిని గురువారం భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఎల్ఈటీ కమాండ్ షాహిద్ అహ్మద్ కుట్టేతో సహా మరో నలుగురి ఇండ్లను నేలమట్టం చేశారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా, షోపియన్, కుల్గాం జిల్లాల్లో ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి ఇళ్లను కూల్చివేశామని అధికారులు ప్రకటించారు.