విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. రెండు ఉత్సవ కమిటీల అధ్యక్షుడిగా దానం నాగేందర్ నేతృత్వంలో కర్ర పూజ జయప్రదంగా ముగిసింది.

ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. ఈసారి గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడి వైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపు లలిత త్రిపురసుందరి మరియు శ్రీ గజ్జలమ్మ దేవి కూడా కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. భక్తులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందిస్తున్న ఈ గణేశ్ విగ్రహం నిర్మాణం త్వరలో ప్రారంభమవనుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *