వెదురుతోనూ విద్యుత్ ఉత్పత్తి… వెదురు వైపు ఆకర్షితులవుతున్న రైతులు
విద్యుత్ ఉత్పత్తి విషయంలో NTPC కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భాగంగా బొగ్గుతో పాటు వెదురును కూడా కలిపి మండించనుంది. మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రంలో తొలిసారిగా ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారి షోలాపూర్లోని సూపర్ థర్మల్ విద్యుత్కేంద్రంలో ‘బయోమాస్ (వెదురు)’ ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎన్టీపీసీకి లేఖ రాశారు. థర్మల్ విద్యుత్కేంద్రానికి అవసరమైన వెదురును షోలాపూర్, సమీప ప్రాంతాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం షోలాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తి కోసం ఏటా 40 లక్షల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు.. ఒక కిలో బొగ్గును మండిస్తే 2.08 కిలోల కార్బన్ విడుదల అవుతుంది. అంటే ఏటా ఏ స్థాయిలో కార్బన్ ఉత్పత్తి అవుతుందో ఊహించుకోవచ్చని అధికారులు అంటున్నారు.
చాలా దేశాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లను మూసివేస్తున్నారు. ఈ విషయంలో మన దేశంలోనూ కొంత పురోగతి ఉంది. షోలాపూర్ ఎన్టీపీసీలో బయోమాస్ గా వెదురును వినియోగించాలని నిర్ణయించాలని, ఇందుకోసం వెదురు సాగును భారీగా పెంచేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం కూడా పేర్కొంది. వెదురు సాగు చేసే రైతులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్ల పాటు వెదురు కొనేలా ఒప్పందం చేసుకునేందుకు ఎన్టీపీసీ అంగీకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారని, పెద్ద ఎత్తున వెదురు సాగుకు ముందుకొస్తున్నారని అధికారులు తెలిపారు. లక్ష హెక్టార్లలో వెదురు సాగు చేయాలని ఎన్టీపీసీ పిలుపునిచ్చింది. దీంతో సంప్రదాయ పంటలు వేసే రైతులు కూడా వచ్చేసారి వెదురుపై దృష్టి నిలపాలని యోచిస్తున్నారు.