శ్రీ ‌గురు తేగ్‌ ‌బహదూర్‌ ఆత్మబలిదానం

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురుతేగ్‌ ‌బహదూర్‌ ‌వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్‌ , ‌తల్లి నానకీ. వైశాఖ కృష్ణ పంచమి నాడు ఈయన అమృత్‌ ‌సర్‌ ‌లో జన్మించారు. మే 1, 2021 న వీరి 400 జయంతి వేడుకలు జరుగుతాయి. ఆయన సమయంలో భారతదేశంలోని చాలా భాగం మొగలాయిల పాలనలో ఉండేది. ఆ పరాయి పాలనను పరిసమాప్తం చేసేందుకు పూనుకున్నవారిలో గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌కూడా ఒకరు. ఆయన వ్యక్తిత్వం సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే, ఆయన కర్తృత్వం శారీరిక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలచింది. ఆయన గురువాణి అందరి మనస్సుల్లో నిలిచిపోయింది. నకారాత్మక ఆలోచనలు అదుపుచేయగలిగితేనే ధర్మ మార్గంలో పయనించ గలుగుతారు. నింద – స్తుతి, లోభం – మోహం వంటివాటికి ఎవరైతే లొంగిపోతారో వారు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటారు. సాధారణ వ్యక్తులు కష్ట సుఖాలకు విచలితులవుతారు. కానీ యోగులు, సిద్ధపురుషులు వీటికి అతీతులు. దీనినే గురు తేగ్‌ ‌బహదూర్‌ ఇలా తెలిపారు – ఊసతతి నిందిఆ నాహి జిహి కంచన్‌ ‌లోహ్‌ ‌సమాని’, – సుఖు దుఖు జిహ్‌ ‌పరసై నహీ లోభు మోహు అభిమాను’ (శ్లోక్‌ ‌మొహలా 9వ భాగం 1426).

గురు తేగ్‌ ‌బహదూర్‌ ఇలా అంటారు – ‘మనిషి మృత్యువుకు చాలా భయపడతాడు. ఆ భయం కారణంగానే మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. జీవితంలో విలువలు వదిలి పెడతాడు. పిరికివాడుగా మారతాడు. చనిపోయే వాడికి ఆ భయం ఉండదు. దాని గురించి చింత ఎందుకు.’ ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మ మార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌భావించారు. ఆయన అటు తన కుటుంబం, ఇటు సమాజంలో సంస్కా రాలను, విలువలను పెంపొందిం చారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన కార్యం వల్ల దేశ ప్రజా నీకంలో ధైర్యం పెరిగింది. బ్రజ భాషలో ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక.

గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌నివసించిన ఆనందపూర్‌ ‌సాహిబ్‌ ‌మొగలుల అన్యాయానికి, అత్యాచారాలకు ఎదురొడ్డి నిలిచింది. భారత్‌ ‌ను పూర్తి ఇస్లామీకరణ చేయాలని ఔరంగజేబ్‌ ‌భావించాడు. బౌద్ధ మతానికి, ఆధ్యాత్మికతకు కేంద్రమైన కాశ్మీర్‌పై దృష్టి సారించాడు. మొగలాయిల అకృత్యాలు, అత్యా చారాలకు భరించలేక కాశ్మీరీలు గురు తేగ్‌ ‌బహదూర్‌కు తమ గోడు చెప్పుకున్నారు. వారు చెప్పినది విన్న తరువాత ఆయన ఆలోచనలో పడ్డారు. కాశ్మీర్‌ ‌మాత్రమేకాకుండా, దేశం మొత్తంలో ఇదే పరిస్థితి ఉంది. దేశం పూర్తిగా ఇస్లామీకరణ చెందకుండా నివారించాలంటే మార్గం ఏమిటి? అందుకు ఒక్కటే మార్గం. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మ బలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజా చైతన్యం వల్ల మొగలాయిలు భయ పడతారు. కానీ అలా బలిదానం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తేగ్‌ ‌బహదూర్‌ ‌పుత్రుడైన శ్రీ గోవింద్‌ ‌రాయ్‌ ‌చెప్పారు. ‘మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?’ అని పలికారు.

ఔరంగజేబ్‌ ‌సైన్యం గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌తోపాటు మరో ముగ్గురు శిష్యుల్ని బంధించింది. అందరినీ ఢిల్లీ తీసుకువచ్చారు. అక్కడ వారిని అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారు. ఇస్లాం స్వీకరించాలని భయపెట్టారు, బెదిరించారు. నానాయాతనలు పెట్టారు. మతగురువును చేస్తామని, భోగ భాగ్యాలకు లోటు ఉండదని ఆశపెట్టారు. అయినా ముగ్గురు శిష్యులతోపాటు గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌ధర్మాన్ని వదలలేదు.

ఢిల్లీ చాందిని చౌక్‌ ‌లో గురు తేగ్‌ ‌బహదూర్‌ ఎదురుగానే ఒక శిష్యుడైన భాయి మతిదాస్‌ను రంపంతో నిలువునా చీల్చారు. మరొక శిష్యుడు భాయి దియాలాను సలసల కాగే నూనెలో వేశారు. భాయి సతిదాస్‌ను పత్తిలో మూటకట్టి దానికి నిప్పు పెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌భయపడతారని వాళ్ళు అనుకున్నారు. అన్యాయం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ధర్మమని గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌భావించారు. అందుకనే ఆయన చలించలేదు. దానితో కాజీ ఆదేశించడంతో ఒక హంతకుడు గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌తలను నరికేశాడు. ఆయన ఈ ఆత్మబలిదానంతో దేశమంతటా ఒక చైతన్యం వచ్చింది. పదవ గురువు గోవింద్‌ ‌సింహ్‌ ‌తన తండ్రి బలిదానాన్ని గురించి ఇలా అన్నారు-

తిలక్‌ ‌జంజూ రాఖా ప్రభ్‌ ‌తాకా ।

కీనో బఢో కలూ మహి సాకా ।।

సాధని హోతి ఇతి జిని కారీ ।

సీస్‌ ‌దిఆ పర్‌ ‌సీ నా ఉచ్రీ ।।

గురు తేగ్‌ ‌బహదూర్‌ 400 ‌జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌మాత్రం మనకు త్యాగం, సంయమనాలను బోధించారు. నేడు సర్వత్ర భోగలాలస పెరిగిపోయింది. అంతటా ఈర్ష్య, ద్వేషం, భేద భావనలు నిండిపోయాయి. సృజన, సమరసత, మానసిక వికారాలపై విజయం సాధించడం కోసం సాధన చేయాలని గురు తేగ్‌ ‌బహదూర్‌ ఉపదేశించారు. గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌ప్రభావం ఎంతటిదంటే ఢిల్లీకి వెళుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను అనుసరించారు, ఆయన బోధలను విన్నారు. ఈ రోజుకీ ఈ గ్రామాల్లో పొగాకు వంటి మాదక పదార్ధాల పంటలు పండించరు. నేడు ప్రపంచంలో తిరిగి మతఛాందసవాదం, తీవ్రవాదం పెచ్చుమీరుతున్నాయి. గురు తేగ్‌ ‌బహదూర్‌ ‌త్యాగం, శౌర్యం, బలిదానపు మార్గం మనకు చూపారు. మానవజాతి పరివర్తన శీలమైన నూతన శకంలో ప్రవేశిస్తున్నది. ఈ సమయంలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం.

– దత్తాత్రేయ హోసబళే, సర్‌ ‌కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *