సరిహద్దుల్లో పాక్ కాల్పులకు 15 మంది మృతి

భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించింది. మంగళవారం రాత్రి నుంచి పాక్‌ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోగా, 57 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది.
ఆర్మీ చీఫ్ స్థానిక ఆర్మీ యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులకు తిరిగి సమాధానం ఇచ్చేందుకు భారత సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. భారత్‌ ఎదురుదాడిలో పాకిస్థాన్ సైనిక పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
భారత మెరుపు దాడులకు ఏం చేయాలో పాలుపోని పాకిస్థాన్ జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున కాల్పులకు జరుపుతోంది. మెర్టార్లు, ఫిరంగులతో సరిహద్దు గ్రామాలపై దాడులకు దిగింది. భారత జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్‌ సైనికులు పెద్ద ఎత్తున చనిపోయారని సమాచారం. డజన్ల కొద్దీ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ డివిజన్‌లోని ఐదు జిల్లాలు, కశ్మీర్‌ డివిజన్‌లోని మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.
ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ, శ్రీనగర్‌, లేహ్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. కథువాలో హెలికాప్టర్‌ సేవలను సైతం నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో అధికారులు, సిబ్బంది ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. పూంచ్‌తో పాటు రాజౌరి, కుప్వారా జిల్లాలోని యురి, కర్నాహ్‌, తంగ్దర్ సెక్టార్‌లలోనూ పాక్ భారీ ఎత్తున కాల్పులు జరుపుతోంది.పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు, దుకాణాలు, అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. పాక్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంత మంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు.
పాకిస్థాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్ లోనూ అప్రమత్తత ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్ , ఫజిల్కా, అమృత్ సర్ , గురుదాస్ పూర్ లో నేడు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. పఠాన్ కోట్ జిల్లాలో 72 గంటల పాటు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *