సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపేస్తున్నాం : పాక్ పై కీలక నిర్ణయం తీసుకున్న భారత్
జమ్మూ కశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా ఈ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులనూ ప్రపంచం ముందు నిలబెడతామని పరోక్షంగా పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ పాకిస్తాన్ తో అత్యంత కఠినంగానే వుండాలని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. పహల్గాంలో పర్యటించి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా.. అక్కడి పరిస్థితి గురించి భేటీలో వివరించారు.
మరోవైపు పాకిస్తాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ నిర్ణయంతో.. సింధు, దాని ఉపనదులైన జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నుంచి పాకిస్థాన్కు నీటి సరఫరాను ఆపేస్తారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాక్ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపివేసేదాకా ఈ ఒప్పందం అమలు కాదని భారత్ ప్రకటించింది.
వాఘా-అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ తక్షణ మూసివేత. సరైన పత్రాలతో ఆ దారి గుండా ఇప్పటికే భారత్లోకి ప్రవేశించినవారు మే1లోపు అదే మార్గంలో వెళ్లిపోవాలని ఆదేశించింది.
పాకిస్థానీ హైకమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించింది. వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే.. ఇస్లామాబాద్లో ఉన్న భారత హైకమిషన్లోని రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్ ఉపసంహరించుకుంది. ఆ పోస్టులన్నీ రద్దు చేసింది.రెండు దేశాల్లోని హైకమిషన్లలో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.