సేవా, త్యాగం భావాలకు భారత్ చిరునామా : దత్తాత్రేయ హోసబళే
భారతదేశం తన సంస్కృతి, జ్ఞానం, నాగరికత, చరిత్ర మొదలైన వాటి గురించి గర్వపడుతుందని, కానీ భారతదేశం అంటేనే సేవా భూమి అని, సేవ, త్యాగం దాని గుర్తింపు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు. ప్రార్థించే నోటి కంటే సేవ చేసే చేతులు చాలా ముఖ్యమైనవని పేర్కొంటూ ఈ సేవా పనిలో నిమగ్నమైన వైద్యులు అటువంటి ప్రశంసనీయమైన పనిని నిజం చేస్తున్నారని కొనియాడారు.
సిటీ మాంటిస్సోరి స్కూల్ గోమతినగర్ ఎక్స్టెన్షన్ ఆడిటోరియంలో జరిగిన శ్రీ గురు గోరఖ్నాథ్ స్వాస్థ్య సేవా యాత్ర 5.0 సత్కార కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 2019 నుండి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు సేవ చేయడం గొప్ప అదృష్టమని చెప్పారు. గురు గోరఖ్నాథ్ స్వాస్థ్య సేవా యాత్ర ద్వారా గొప్ప ప్రజా సేవ చేస్తున్న సభ్యులందరూ గౌరవానికి అర్హులని కొనియాడారు.
‘ఇది గౌరవ కార్యక్రమం కాదు, కృతజ్ఞతా కార్యక్రమం’ అని పేర్కొంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ధన్వంత్రి, భరతమాత, గురు గోరఖ్నాథ్, స్వామి వివేకానంద చిత్రపటాలకు పుష్పగుచ్ఛాలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభివృద్ధి ప్రధాన స్రవంతిలో వెనుకబడిన ప్రజల పట్ల మనం కృతజ్ఞత చూపించాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ సూచించారు. ఈ వైద్యుల నుండి ప్రేరణ పొంది, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
అణగారిన ప్రాంతాలకు వెళ్లి సేవ చేయడం గౌరవనీయమైన పని కాబట్టి, దీనిని గౌరవ కార్యక్రమం అని పిలవకూడదని,, కృతజ్ఞతా కార్యక్రమం అని పిలవాలని చెప్పారు. అణగారిన ప్రజల పట్ల కరుణ, దృఢ సంకల్పంతో దీనిని నిజం చేసేవారే ‘మానవ సేవ-మాధవ్ సేవ’ అనే మంత్రాన్ని సజీవంగా తీసుకువస్తున్నట్లని తెలిపారు. సామాజిక సంస్థలు, ప్రభుత్వం, పరిపాలన సంయుక్త ప్రయత్నాల కారణంగా, ఈ సేవ లబ్ధిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ప్రజల బాధలను తగ్గించే అటువంటి వైద్యులకు వందనం అని చెప్పారు.