‘మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’
మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయ వద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో హిందూ ధార్మిక సభ్యులు, వేలాది మంది గిరిజన ప్రజలతో మహార్యాలీ నిర్వహించారు. తలార్సింగి గౌతమి పాఠశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుండ్రుపుట్టు, మెయిన్ బజార్, పాత బస్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ‘‘మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, గిరిజన సాంస్కృతిని పరిరక్షణ చేసుకోవాలని, విదేశీ సాంస్కృతి వద్దు స్వదేశీ సాంస్కృతి ముద్దు, మతమార్పిడిని అరికట్టండి, ధర్మసాంస్కతిని రక్షించండి, క్రైస్తవులుగా మారినతరువాత గిరిజనులు ఎలా అవుతారు, అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాతి సురక్షా మంచ్ జాతీయ ప్రతినిధి హెచ్.కె. నాగు మాట్లాడుతూ మతం మారిన గిరిజనులను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ… జీఓ నం3ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఇది చాలక ఆంధప్రదేశ్ వైకాపా, తెదేపాలు కలిసి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు విఫలయత్నం చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంట్కు పంపితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందన్నారు. ఇప్పుడు వైసీపీ మరోసారి తీర్మానం చేసి పంపితే గిరిజనులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.. మతం మారిన గిరిజనులంతా తిరిగి స్వధర్మంలోకి రావాలని ఆయన కోరారు. లేదంటే వారి ధ్రువపత్రాల్లో కూడా మతాన్ని మార్చుకోవాలని డిమాండు చేశారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం మతం మారిన గిరిజనుల పట్ల ఇదే వైఖరి అవలంభించాలన్నారు.
ఆంధప్రదేశ్లో కూడా పెద్ద సంఖ్యలో మతమార్పిడులు జరిగాయి. ఆ కారణంగా నిజమైన గిరిజనులు పలు సౌకర్యాలను కోల్పోతున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన కారణంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ తో ఎన్నికైన ఒక శాసనసభ్యుడుని ఇటీవలే కేరళ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. రాజ్యాంగంలో గట్టి నిబంధనలు వుండడం వల్లే ఇది సాధ్యమైంది.
గిరిజనులకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి నిబంధన లేకుంటే కొంతకాలం తరువాత గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం వుంది. ఆంధప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే కోట్లాది మంది గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. మతమార్పిడి అయినా వారిని జాబితా నుంచి గిరిజనులను తొలగించాలని కోరుతున్నట్లు పలువురు తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన ఐక్యవేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు, విశిష్ట అతిథులుగా శ్రీ సూర్య నారాయణ, అఖిల భారతీయ సంఘటనా మంత్రి, జనజాతి సురక్ష మంచ్ భోపాల్ శ్రీశ్రీ సాయిరాం స్వామీజీ, సద్గురు సేవా ఆశ్రమం, విశాఖపట్నం, శ్రీ రామానంద స్వామీజీ, ఉత్తర వాహిని, బలిఘట్టం ఆశ్రమం పాల్గొన్నారు. శ్రీ వివేక్ వినాయక్, జనజాతి సురక్ష మంచ్, డాక్టర్ తమర్భ నర్సింగ రావు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్, ఆంధ్ర ప్రదేశ్, శ్రీ ఓండ్రు రామమూర్తి, అడిషనల్ రిజిస్టర్/ మెంబర్ ఏ.పీ. కోఆపరేటివ్ ట్రిబ్యునల్, శ్రీమతి కిముడు దేవి, సోషల్ వర్కర్, గిరిజన ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి, ఆంధప్రదేశ్, పాల్గొన్నారు.