తహవూర్ రాణాని భారత్ కి అప్పగించిన అమెరికా.. రేపటి కల్లా భారత్ కి
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణాను అమెరికా అధికారులకు భారత్ కి అప్పగించేశారు. ప్రస్తుతం రాణాను తీసుకొని, భారతీయ అధికారుల బృందం భారత్ కు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాలు ప్రపంచ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రికల్లా లేదా గురువారం ఉదయం కల్లా భారత్ కి చేరుకోనున్నారు.
తహవూర్ రాణాకు అమెరికాలో వుండేందుకు వున్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. దీంత అతడ్ని ఇండియాకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను భారత్ కి అప్పగించవద్దంటూ రాణా అమెరికాలోని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై అక్కడి న్యాయస్థానం విచారించింది. విచారణ తర్వాత రాణా పిటిషన్ ని కొట్టిపారేసింది. తహవూర్ రాణా అభ్యర్థనను కొట్టేస్తున్నామని అమెరికా సుప్రీం కోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయ్యింది.
2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.