ఒడిశాలో 35 మందికి భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు
పౌరసత్వ (సవరణ) చట్టం 2019 కింద 35 మంది హిందువులకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఒడిశాలో సీఏఏ అమలులో ఇదో కీలక ముందడుగు.భువనేశ్వర్లోని కృషి భవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నబరంగ్పూర్ జిల్లా నివాసితులందరికీ భారత పౌరసత్వం లభించింది. ఈ కార్యక్రమాన్ని ఒడిశాలోని సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ మరియు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సంయుక్తంగా నిర్వహించాయి. పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించిన తర్వాత ముఖ్యమంత్రి మాంఝీ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు మీరు మాలో భాగం. మీ భద్రత, గౌరవం, పురోగతి, అభివృద్ధి అనేవి మా బాధ్యతే కాదు. మా విధి కూడా. భారత పౌరులుగా నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను’’ అని ప్రకటించారు.

పౌరసత్వ ధృవీకరణ పత్రాల ప్రదానం భారతదేశం యొక్క “కరుణ, మానవత్వం మరియు ఆశ్రయం యొక్క శాశ్వత నాగరికత విలువలను” ప్రతిబింబిస్తుందని అని కూడా పేర్కొన్నారు.మరే దేశంలోనైనా హిందువులు హింసకు గురైతే, వారికి ఆశ్రయం కల్పించగల దేశం భారతదేశం తప్ప మరెక్కడా లేదు. కాబట్టి భారతదేశంలో అలాంటి చట్టం అమలు చేయకపోతే, మరెక్కడ అమలు అవుతుంది? అంటూ ప్రశ్నించారు.
భారత్ లో సంప్రదాయకంగా వున్న మైనారిటీ హక్కులను కాపాడటంలో అందరూ గళం విప్పుతున్నారని, అయితే పొరుగు దేశాలలో మైనారిటీలపై జరుగుతున్న వేధింపుల గురించి మాత్రం చాలా మంది మౌనంగా వున్నారని దెప్పిపొడిచారు.,ప్రజల మనస్తత్వం మారుతోందని, లౌకికవాదం పేరుతో ఒకే ఒక మతాన్ని ఎంపిక చేసుకుని ప్రోత్సహించే ఆచారం క్రమంగా తగ్గుతోందని, ప్రజల్లో అవగాహన పెరిగిందని మాంఝీ అన్నారు.