ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు శ్రమించారు : ఇస్రో చైర్మన్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మంది శాస్త్రవేత్తలకు పైగా రేయింబవళ్లు శ్రమించారని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్కు కావాల్సిన శాటిలైట్ సమాచారాన్ని అందించారని అన్నారు. ఇస్రోకు చెందిన వివిధ శాటిలైట్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రత కోసం అందజేశామని తెలిపారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 52వ జాతీయ మేనేజ్మెంట్ సమావేశాల సందర్భంగా ఇస్రో చీఫ్ ఈ వివరాలను పంచుకున్నారు. ఆ సమయంలో అన్ని ఉపగ్రహాలు చక్కగా పనిచేశాయని తెలిపారు .
ఇక ఇస్రో తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా అద్భుతంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. 2027 కల్లా ఈ యాత్ర చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకూ 7,700 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు. మరో 2,300 పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.