50 ఏళ్లుగా ఎడారిలో మొక్కలకు ప్రాణం… ఎడారి ప్రాంతం కాకుండా తాపత్రయం

అదంతా ఎడారి ప్రాంతమే. మొక్క పుడితే ఒట్టు. ఎవరికి వారు జీవిత సంఘర్షణలోనే వుండిపోతారు. పర్యావరణం, నీటి వ్యవస్థ గురించి ఎవరు ఆలోచిస్తారు? అంత తీరిక ఎవరికి వుంటుంది? కానీ… రాజస్థాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి 50 సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ, తన గ్రామం ఎడారి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన పేరు రణరామ్ బిష్ణోయ్. వృద్ధాప్యంలోనూ మొక్కలు నాటుతూ.. వాటికి స్వయంగా నీరు పోస్తుంటారు. అలా ఇప్పటి వరకు సుమారు 30 వేల మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తన ప్రాణం పోయినా సరే.. పర్యావరణాన్ని మాత్రం రక్షిస్తానని, తన ఒంట్లో వుండే చివరి ఊపిరి వరకూ పర్యావరణం కోసం పనిచేస్తానని ప్రకటించారు. రణరామ్ బిష్ణోయ్ కి అటు ఇటుగా 80 సంవత్సరాలుంటాయి. జోథ్ పూర్ కి వంద కిలోమీటర్ల దూరంలోని ఎకల్ఖోరి స్వగ్రామం. ఈ గ్రామం ఎడారికి అత్యంత సమీపం. వర్షాభావ పరిస్థితుల కారణంగా తన ప్రాంతం ఎడారిగా మారుతుందని ముందే గ్రహించారు. ఎలాగైనా తన గ్రామం ఎడారి మయం కాకుండా వుండాలని, పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఆయన గ్రామానికి ఆనుకొనే ఓ దిబ్బ వుంది. అక్కడే మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఇలా ఊరు చుట్టూతా వేలాది మొక్కలు నాటారు. వీటికి నీళ్లు పోయడం కోసం తన ఇంటి నుంచి దిబ్బ దగ్గరికి రోజూ మూడు కిలోమీటర్ల దూరం నడిచేవాడు. వైప, రోహిదా, ఫిగ్, ఖేజ్రీ, కంకేరి, బాబుల్, కాగితం పూల చెట్లు… ఇలా అనేక రకాల మొక్కలు నాటుతారు. ఏకంగా 50 సంవత్సరాలుగా ఇదే ప్రయత్నంలో వున్నారు. మొక్కలకు నీరు పోస్తూ, ఇంకా కొత్త కొత్త మొక్కలను నాటుతున్నాడు. స్థానికులు ఆయన్ను ‘‘అహూ’’ అని పిలుస్తారు. అహూ అంటే చెట్టు మనిషి అని అర్థం.

ఇలా ఎందుకు చేస్తున్నారంటూ అడిగితే.. ‘‘మొక్కలు నాకు దేవుళ్లతో సమానం. వాటిని సేవించడం ద్వారా నాకెంతో ఉపశమనం. గ్రామంలోని ప్రజలను కూడా మొక్కలకు నీరు పోయడానికి తీసుకెళ్తాను. మొక్కకు 2 రూపాయలు చొప్పున చెల్లిస్తాను.భూమి మీద మనుషులకు ఎంత హక్కు వుందో.. జీవరాశులు, మొక్కలకు కూడా అంతే హక్కులు వుంటాయి. మనకు చెట్లు చాలా ఇస్తున్నాయి. తిరిగి మనం ఇచ్చేయాలి. అలా ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేకపోయినా.. వాటిని నాశనం చేయవద్దు. ’’ అంటూ పేర్కొన్నారు.

యాభై సంవత్సరాల క్రితం జరిగిన బికనీర్‌లోని ముకంలో జరిగిన కమ్యూనిటీ ఫెస్టివల్ నుండి తన ప్రేరణ పొందానని తెలిపాడు. పర్యావరణం, పరిరక్షణ దానిపై పర్యావరణ ప్రేమికులు చెప్పిన విషయాలతో చాలా స్ఫూర్తి పొందానన్నారు. ఆ రోజే తనను బాగా మార్చేసిందని, బికనీర్ నుంచి కొన్ని మొక్కలు తెచ్చి, పరిసరాల్లో నాటడం ప్రారంభించానని తెలిపారు.పర్యావరణం పట్ల రణారామ్‌కు ఉన్న అచంచలమైన ప్రేమ మరియు దాని పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు మనలో ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్లి మన జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *