70 కాదు.. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు : భారత ప్రభుత్వం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆపరేషన్ సిందూర్ గురించి, దాని ఫలితాల గురించి కేంద్రం అఖిల పక్ష నాయకులకు కూలంకషంగా వివరించింది. అయితే… ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై జరిపిన దాడుల్లో 70 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షంలో పూర్తి క్లారిటీ ఇచ్చింది. హతమైంది 70 మంది కాదని, ఆపరేషన్ సిందూర్ లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ విజృంభిస్తే మాత్రం.. భారత్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని రాజ్‌నాథ్ అఖిలపక్ష నాయకులకు తేల్చి చెప్పారు. ముఖ్యంగా, భారత సాయుధ దళాలు నిర్వహించిన ఖచ్చితమైన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామాబాద్ బుధవారం ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి పై వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ తర్వాతి పరిణామాలపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికే అఖిలపక్ష సమావేశం జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ అత్యంత పరిణతితో వ్యవహరించారని, గొడవలకు ఎవ్వరూ దిగలేదని ప్రకటించారు. అయితే.. దేశ భద్రత గురించి మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వుండే ప్రజల భద్రత గురించే అఖిలపక్షంలో నేతలందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని కూడా పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ పోరాటంలో అందరూ ఐక్యంగానే వున్నామని, అందరూ మద్దతు ప్రకటించారని కిరణ్ రిజిజు వెల్లడించారు.
‘‘అందరు నాయకులూ అత్యంత పరిణతితో వ్యవహరించారు. ఆపరేషన్ సిందూర్ ను, సాయుధ దళాలను అందరూ ప్రశంసించారు. అభినందించారు. సాయుధ దళాలకు తమ మద్దతు కూడా వుంటుందని ప్రకటించారు. అలాగే ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము రాజకీయాలు చేయమని, దేశ నిర్మాణం కోసం కూడా రాజకీయాలు చేస్తామని రక్షణమంత్రి ఈ సమావేశంలో పేర్కొన్నారు. అయితే… ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతున్న ఆపరేషన్ అని, అందుకే అన్నిరకాలైన సాంకేతిక వివరాలను అఖిలపక్షంతో పంచుకోలేదు’’ అని కిరణ్ రిజిజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *