‘భళా’ భారతీయ మహిళ – రాష్ట్ర సేవికా సమితి
కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. కన్ను చమరిస్తుంది. లాక్డౌన్ వేళ సాధారణ ప్రజానీకం పడుతున్న కష్టాలను చూసి భారతీయ మహిళ తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.
లాక్డౌన్ విధించిన నాటి నుండి సేవాభారతి కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాల్లో సేవికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భాగ్యనగర్లోని మల్కాజ్గిరిలో రాష్ట్ర సేవికా సమితి నిర్వహిస్తొన్న సేవాప్రకల్పం అపరాజిత సేవా సమితి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న యువతులు సేవాభారతి ద్వారా పంపిణి చేస్తున్న బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు తదితర సరుకులను ఆరువందల కిట్లుగా తయారుచేసి అందచేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని అపార్ట్మెంట్లోని ఆరు కుటుంబాల నుండి ఇరవై మంది వ్యక్తులు మరో నాలుగు వందల కిట్స్ను అందించారు. అంటువ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే మాస్కులు తప్పని సరి. వాటి అవసరాన్ని గుర్తించిన సేవాభారతి త్వరతిగతిన మాస్కులు కుట్టివ్వాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపును సవాలుగా స్వీకరించి యుద్దప్రాతిపదికన 1500 మాస్కులు కుట్టి ఇచ్చారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఒక సేవిక వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి మహిళలకు అవసరమైన సానిటరి ప్యాడ్స్ను అందించింది. బిహెచ్సిఎల్లో మరో సేవిక స్వంతంగా భోజనం తయారు చేసి 150 మంది పేదలకు అన్నదానం చేసింది.ఆకలితో అలమటిస్తొన్న అన్నార్తులు ఆ అన్నాన్ని అమృతంగా స్వీకరించారు. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమో అది తల్లి మాత్రమే గుర్తిస్తుంది. అమ్మ మనసు అంటే అదే కదా మరి !
వరంగల్ సేవికాసమితి ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రిలోని వందమంది రోగులకు ఏప్రిల్ 14న భోజన ప్యాకెట్లను అందించారు. నలభై మీటర్ల బట్టతో మాస్కులు కుట్టి పంపిణీ చేశారు. ఏప్రిల్ 28న యాభైమంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి కూరగాయల కిట్, మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లను అందచేశారు. ఖమ్మం జిల్లా కార్యవాహిక నేతృత్వంలో సేవా భారతి సహకారంతో 352 కుటుంబాలకు నిత్యావసర సామాగ్రి, కూరగాయలను అంద చేశారు. కర్నూల్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నిరంతరాయంగా మాస్కులను తయారు చేసే పని చేపట్టారు. హైదరాబాద్ నగరంలో రేడ్జోన్ ప్రాంతాల్లో రోగనిరోధక శక్తిని పెంచే కషాయాన్ని సేవికలు తయారు చేసి పంపిణీ చేశారు.